Breaking News

సుప్రీంలో యోగి సర్కారుకు ఎదురుదెబ్బ.. ఆ రికవరీ సొమ్ము వెనక్కు ఇవ్వాలని ఆదేశం


పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు సందర్భంగా ప్రజా, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాగా.. ఆందోళనకారుల నుంచి నష్టపరిహారాన్ని వసూలు చేసే విషయంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రికవరీ నోటీసుల ప్రకారం వసూలు చేసిన సొమ్ము, జప్తు చేసిన ఆస్తులను వారికి తిరిగి ఇచ్చేయాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. సర్కారు చర్యను ‘అన్యాయంగా సంపదను పోగెయ్యడం’గా అభివర్ణించింది. అయితే, 2020 ఆగస్టు 31న నోటిఫై చేసిన యూపీ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల నష్టపరిహార వసూలు చట్టం ప్రకారం ‘క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌’ను ఏర్పాటు చేసి దాని ద్వారానే నష్టపరిహారాన్ని బాధ్యుల నుంచి వసూలు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. అంతేకాదు, ఈ వ్యవహారంలో పక్షపాత ధోరణికి అవకాశం ఇవ్వరాదని హితవు పలికిన ధర్మాసనం.. న్యాయ వ్యవస్థ ద్వారా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వమే నేరుగా చేపట్టడం తగదని ఆక్షేపించింది. ఈ సందర్భంగా నష్టపరిహారం వసూలు కోసం సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులకు 2019 డిసెంబరులో జారీ చేసిన నోటీసులను ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా వెనక్కి తీసుకున్నట్లు యూపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్‌ జనరల్‌ గరిమా ప్రసాద్‌ తెలిపారు. సంబంధిత దస్త్రాలను క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌కు పంపించినట్లు ఆయన వివరించారు. ప్రజా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన విధ్వంసకారుల నుంచి వసూలు చేసిన నిధులను తిరిగి చెల్లించాలని ఆదేశించడానికి బదులుగా ప్రభుత్వం, నిరసనకారులు ‘క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌’ను ఆశ్రయించేందుకు అవకాశమివ్వాలన్న ఏఏజీ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. రికవరీ నోటీసులు వెనక్కితీసుకున్నప్పుడు పౌరుల నుంచి వసూలు చేసిన మొత్తాలను, జప్తు చేసిన ఆస్తులనూ తిరిగి ఇచ్చేయాల్సిందేనని విస్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వం జారీచేసిన రికవరీ నోటీసులపై ఆరిఫ్ టిటూ అనే వ్యక్తి సవాల్ చేయడంతో సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టింది. ఈ ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని ఫిబ్రవరి 11న సూచించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌ల ధర్మాసనం.. ప్రొసీడింగ్స్‌ను ఉపసంహరించుకోవడానికి ఒక చివరి అవకాశం ఇస్తున్నామని, లేదా చట్టాన్ని ఉల్లంఘించినందుకు దానిని రద్దు చేస్తామని హెచ్చరించింది. నిందితుల ఆస్తులను జప్తు చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘ఫిర్యాదుదారు, న్యాయమూర్తి, ప్రాసిక్యూటర్’‌లాగా వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినవారి నుంచి నష్టపరిహారం వసూలు చేయాలని 2009, 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను శుక్రవారం జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ తీర్పుల లక్ష్యం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో పౌరుల బాధ్యతలను గుర్తుచేయడమేనని తెలిపింది. విధ్వంసకారుల నుంచి పరిహారం వసూలు ప్రక్రియను కూడా న్యాయవ్యవస్థ ద్వారానే చేపట్టాల్సి ఉంటుందని, చట్ట నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2020లో తీసుకొచ్చిన యూపీ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల నష్టపరిహార వసూలు చట్టం రాజ్యాంగ చెల్లుబాటు అంశం ప్రస్తుతం తమ ముందు లేనందున దానిపై వ్యాఖ్యానించలేమని పేర్కొంది. కొత్త చట్టం చెల్లబాటు అంశాన్ని న్యాయవాది నిలోఫర్‌ ఖాన్‌ ప్రస్తావించినప్పుడు ధర్మాసనం ఈ స్పష్టతనిచ్చింది. యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన పర్వేజ్ అరిఫ్.. నోటీసుల విషయంలో ఏకపక్ష పద్ధతి అవలంభించిందని ఆరోపించారు. అంతేకాదు, ఆరేళ్ల కిందట మరణించిన 94 ఏళ్లు వ్యక్తికి, 90 ఏళ్లు పైబడిన ఇద్దరు వ్యక్తులతో సహా అనేక మందికి నోటీసు పంపినట్టు కోర్టుకు తెలిపారు.


By February 19, 2022 at 07:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sc-to-uttar-pradesh-govt-for-return-money-recovered-from-anti-caa-protesters/articleshow/89676803.cms

No comments