Breaking News

యూపీలో ప్రారంభమైన తొలిదశ పోలింగ్.. కీలకంగా మారిన జాట్ ఓట్లు


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00 గంటలకు ప్రారంభమయ్యింది. ఈ దశలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. మంత్రులు శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్‌లు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. మొత్తం 25,849 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. కోవిడ్-19 నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో పశ్చిమ యూపీ కీలక పాత్ర పోషించింది. దీంతో బీజేపీపై ఇది కొంత ప్రతికూలాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్‌కు ముఖద్వారమైన ఢిల్లీ సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో షామ్లీ, ముజఫర్‌నగర్‌, బాగ్‌పత్‌, మేరఠ్‌, గాజియాబాద్‌, హాపుఢ్‌, గౌతమబుద్ధనగర్‌, బులంద్‌శహర్‌, అలీగఢ్‌, మథుర, ఆగ్రా జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ జాట్‌ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఈ సామాజిక వర్గమే ముందుండి నడిపించింది. ఇది అధికార బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కరోనా సమయంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ తీరుపైనా నిరసనలు వెల్లువెత్తాయి. జాట్‌లలో పట్టున్న రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్డీ)తో పొత్తు సమాజ్‌వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడం వంటి పరిణామాలు కాషాయదళానికి అడ్డంకిగా మారాయి. గత ఎన్నికల్లో పశ్చిమ యూపీలో 58 సీట్లలో 53 సీట్లను గెలుచుకుంది. 2017 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన ఆర్ఎల్డీ.. ఈసారి ఎస్పీ వెంటనడుస్తోంది. 2013 ముజఫర్‌నగర్ హింసాత్మక ఘటనలతో జాట్‌లు, మైనార్టీల మధ్య చీలిక ఏర్పడటంతో 2017 ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెరుకు పంటకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలోని రైతులకు రూ.1.5 లక్షల కోట్లు చెల్లించామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకొంటున్నప్పటికీ అన్నదాతలకు మాత్రం ఆ మాటలు సంతృప్తినివ్వడం లేదు. అది ఓట్ల రూపంలో వెళ్లగక్కనున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ యూపీలో ప్రధానంగా వార్తల్లో ఉన్న నియోజకవర్గాలైన కైరానా, థాన్‌భవన్, సర్దానా, ఆగ్రా రూరల్, మథుర, నొయిడా, హస్తినాపూర్‌‌లో యోగి క్యాబినెట్‌లోని మంత్రులు బరిలో ఉన్నారు.


By February 10, 2022 at 07:30AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/uttar-pradesh/news/assembly-election-polling-begin-at-58-seats-in-jat-dominated-areas-of-up/articleshow/89466413.cms

No comments