Breaking News

రైలులో టిక్కెట్ లేని ప్రయాణం: 1.78 కోట్ల మందికి ఫైన్..9 నెలల్లో రూ.1,000 కోట్లు వసూలు!


రైల్వేకు జరిమానాల రూపంలో దండిగానే ఆదాయం సమకూరుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాల్లో జరిమానాల ద్వారా మొత్తం రూ.1,000 కోట్లకుపైగా వచ్చినట్టు ప్రకటించింది. తొమ్మిది నెలల కాలంలో 1.78 కోట్ల మంది ప్రయాణికుల నుంచి జరిమానాలు వసూలు చేసినట్లు తెలిపింది. 2021-22 మొదటి తొమ్మిది నెలల్లో.. టికెట్లు లేకుండా, అదనపు లగేజీకి రుసుము చెల్లించకుండా ప్రయాణించిన వారివద్ద నుంచి రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐలో దాఖలు చేసిన అర్జీకి రైల్వే బోర్డు స్పందించింది. ఇందుకు సంబంధించిన డేటాను అందుబాటులో ఉంచింది. 2021 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో ప్రయాణ, ఫ్లాట్‌ఫామ్‌, లగేజీ టికెట్‌ లేకుండా ఉన్న 1.78 కోట్ల మందిని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. వారి వద్ద నుంచి జరిమానాల రూపంలో ₹1,017.48 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. ఈ జరిమానాల వసూళ్లు 2019-2020 కంటే 79 శాతం అధికమని వివరించింది. కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేతతో పెరిగిన ప్రయాణాలు, ఆన్‌లైన్‌ బుకింగ్‌తో చాలా మంది బుక్‌ చేసుకోకుండానే రైలు ఎక్కడం భారీ జరిమానాలకు కారణమని ఓ అధికారి వెల్లడించారు. 20202-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా వైరస్ కట్టడికి ప్రయాణాలపై కఠిన ఆంక్షలు విధించడంతో టిక్కెట్ లెకుండా ప్రయాణించినవారి సంఖ్య 27 లక్షలే కావడం గమనార్హం. కరోనా ప్రభావం చూపని అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2019-20లో 1.10 కోట్ల మంది ప్రయాణికులు టిక్కెట్లు లేకుండా ప్రయాణించగా.. వారి నుంచి రూ.561.73 కోట్ల జరిమానా కింద వసూలు చేశారు. కానీ, 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి మధ్య 27.57 లక్షల మంది టిక్కెట్లు లేకుండా ప్రయాణించగా.. వారి నుంచి రూ.143.82 కోట్లు జరిమానా కింద వసూలయ్యాయి. రైల్వేలు అందించిన డేటా ప్రకారం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రిజర్వేషన్ చార్ట్‌లు ఖరారైన తర్వాత వెయిట్‌లిస్ట్‌లో ఉన్న 52 లక్షల మందికి పైగా రైళ్లలో ప్రయాణించలేకపోయారు.


By February 21, 2022 at 07:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rs-1017-crores-fine-from-1-78-crore-ticketless-passengers-in-first-9-months-of-fy-22/articleshow/89713644.cms

No comments