Breaking News

అత్యవసరమైతే తప్ప ఉక్రెయిన్‌లో ఉండొద్దు.. భారతీయులకు మళ్లీ హెచ్చరిక


కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఉక్రెయిన్‌లో ఉండొద్దని సూచించింది. భారత పౌరులు, విద్యార్థులతో పాటు కీవ్‌లోని రాయబార కార్యాలయ సిబ్బంది కుటుంబసభ్యులు కూడా ఉక్రెయిన్ విడిచి రావాలని పేర్కొంది. విమానాల షెడ్యూళ్లు, ఇతర సమాచారం కోసం విద్యార్థులు.. తమ కౌన్సిలర్లను సంప్రదించాలని, రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌ను, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలను అనుసరించాలని కీవ్‌లోని రాయబార కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘అత్యవసరమైతే తప్ప ఉక్రెయిన్‌లో ఉండొద్దని తెలిపింది. ఉక్రెయిన్‌లో పరిస్థితికి సంబంధించి కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు, అనిశ్చితి దృష్ట్యా అక్కడ ఉండాల్సిన అవసరం లేని భారతీయ పౌరులు, విద్యార్థులందరూ తాత్కాలికంగా విడిచిపెట్టాలి.. విమానాల షెడ్యూళ్లు, ఇతర సమాచారం కోసం కౌన్సిలర్లను సంప్రదించాలి.. రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌ను, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలను అనుసరించాలి’’ అని కీవ్‌లోని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. సమాచారం, సహాయం అవసరమైన ఉక్రెయిన్‌లోని భారతీయులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా ఎంఈఏ ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు. కాగా, ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వచ్చేవారికి విమాన టిక్కెట్లు లభించడం లేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీవ్‌లో భారత రాయబార కార్యాలయంలో 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌‌కు ఫిబ్రవరి 22,24,26 తేదీల్లో ఎయిరిండియా మూడు ప్రత్యేక విమానాలను నడపనుంది. ఈ విమానాలు ఉక్రెయిన్‌లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నాయి. మరోవైపు, ఉక్రెయిన్‌ రాజధానికి విమానయాన సేవలను నిలిపివేయనున్నట్లు జర్మనీ ఎయిర్‌లైన్స్‌ సంస్థ లుఫ్తాన్సా ప్రకటించింది. మంగళవారం నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తోపాటు, కీలకమైన ఒడిసా పోర్టు సిటీకి కూడా విమానయాన సేవలు అందించలేమని పేర్కొంది. ఏ క్షణమైన దాడి చేయవచ్చనే ప్రచారం జరగడంతో ఈ నిర్ణయం తీసుకొంది. కాగా, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్స్కీ స్పందించారు. తాము రెచ్చగొట్టే చర్యలకుస్పందించమని పేర్కొన్నారు. రష్యా వైపు నుంచి వచ్చే ఎటువంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్‌ పేర్కొంది. తమ దేశం భయపడటంలేదని పేర్కొనింది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల్లో మూడో రోజు ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.


By February 21, 2022 at 08:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/family-members-of-indian-embassy-staff-and-students-in-ukraine-told-to-return/articleshow/89714138.cms

No comments