Breaking News

దేశంలో మరోసారి బ్లాక్ ఫంగస్ కలకలం.. ఆ రాష్ట్రంలో తొలి కేసు నమోదు


దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. కేవలం కొద్ది రోజుల్లోనే రోజువారీ కేసులు లక్షల్లో నిర్ధారణ అవుతున్నాయి. కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ సహా సాధారణ కరోనా కేసులు భారీగా నమోదుకావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో మరోసారి బయటపడం కలకలం రేగింది. రెండో వేవ్‌లో భయాందోళనకు గురిచేసి బ్లాక్ ఫంగస్ తొలి కేసు.. ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా నిర్ధారణ అయ్యింది. కాంట్‌ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మధుమేహం బాధితుడైన అతడికి కంటి నొప్పి రావడంతో పరీక్షలు నిర్వహించగా బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయ్యిందని జీఎస్‌వీఎం మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంజయ్‌ కాలా చెప్పారు. మధుమేహం కారణంగా బాధితుడికి బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు భావిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. బాధితుడ్ని బ్లాక్‌ ఫంగస్‌ వార్డులో చేర్చి చికిత్స అందజేస్తున్నామని తెలిపారు. ముంబయిలోనూ ఓ 70 ఏళ్ల కరోనా బాధితుడికి కూడా బ్లాక్ ఫంగస్ సోకినట్టు వైద్యులు తెలిపారు. జనవరి 5న బాధితుడు కరోనా బారినపడగా.. జనవరి 12న బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడు ముంబయి సెంట్రల్‌లోని వాక్‌హార్డ్ ఆస్పత్రిలో చేరాడని పేర్కొన్నారు. సెకండ్‌ వేవ్‌ సమయంలో దేశాన్ని బ్లాక్‌ ఫంగస్‌ హడలెత్తించింది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకాగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు కంటి చూపును సైతం కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి బ్లాక్ ఫంగస్ కేసు వెలుగుచూడటం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డయాబెటీస్ నియంత్రణలో లేని కరోనా బాధితులు ‘బ్లాక్ ఫంగస్’ బారినపడుతున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. కిడ్నీ మార్పిడి తదితర సర్జరీలు, చికిత్సల కోసం ఇమ్యునిటీ కంట్రోల్ డ్రగ్స్ వాడిన రోగుల్లో కూడా ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడుతోంది. ఇదివరకే అనారోగ్య సమస్యలున్న కరోనా బాధితులకు స్టిరాయిడ్స్ అతిగా ఇవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడుతున్నట్లు కనుగొన్నారు. మధుమేహం, బీపీలను నియంత్రణలో ఉంచుకోవాలని, కరోనాకు చికిత్సలో స్టెరాయిడ్లను అతిగా వినియోగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,82,900 కేసులు బయటపడ్డాయి. మరో 1,88,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 18.33 లక్షలు దాటాయి. అయితే, గత పది రోజుల నుంచి మరణాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 350 మంది ప్రాణాలు కోల్పోయారు.


By January 19, 2022 at 09:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-registered-its-first-case-of-mucormycosis-also-known-as-black-fungus-in-third-wave/articleshow/88987445.cms

No comments