Breaking News

తండ్రి ఆస్తిపై కుమార్తెలకే వారసత్వ హక్కు..సుప్రీం మరో చరిత్రాత్మక తీర్పు


కుమార్తెలకు వారసత్వ హక్కులపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. వీలునామా రాయకుండా చనిపోయిన తండ్రి సంపాదించిన, విభజన ద్వారా పొందిన ఆస్తులపై ఆయన కుమార్తెలకు హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. తండ్రి ఆస్తులపై కుటుంబంలోని దాయాదుల కంటే కుమార్తెలకే ప్రాధాన్యం ఉంటుందని ఈ మేరకు జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ కృష్ణ మురారిల ధర్మాసనం తీర్పు చెప్పింది. కుమార్తెలకు వారస్వత హక్కులపై తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఉమ్మడి కుటుంబంలో చనిపోయిన హిందూ వ్యక్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతడి సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. తండ్రి మరణానంతరం ఆస్తులు ఆయన సోదరుడి కుమారుడికి చెందుతాయా? సొంత కుమార్తెకు వారసత్వ హక్కు లేదా? అనే అంశాలపై ధర్మాసనం విచారణ జరిపి 51 పేజీల తీర్పు వెలువరించింది. ‘‘కుమార్తెలకు, వితంతువైన భార్యకు ఉన్న హక్కును పురాతన హిందూ సంప్రదాయ చట్టాలు, వివిధ తీర్పులు స్పష్టంగా గుర్తించాయి. అయితే, ఒక హిందూ మహిళ ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే మాత్రం ఆమెకు తన తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా సంక్రమించిన ఆస్తిపాస్తులు ఆమె తండ్రి వారసులకు చెందుతాయి. ఆమెకు భర్త లేదా మామగారి ద్వారా లభించిన ఆస్తులు భర్త వారసులకు దక్కుతాయి’’ అని పేర్కొంది. ‘హిందూ వ్యక్తిగత చట్టాల క్రోడీకరణ, హిందూ వారసత్వ చట్టం 1956 అమలులోకి రాకముందే తండ్రి ఆస్తిపై సమాన హక్కు ఉన్న కుమార్తెలు.. తండ్రి 1956కి ముందు మరణించినా ఆస్తుల విభజనకు వారసత్వ చట్టం వర్తిస్తుంది.. 1949లో మరణించిన వ్యక్తి స్వీయ ఆర్జిత ఆస్తులు, ఆ వ్యక్తి ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నప్పటికీ అతని ఏకైక కుమార్తెకు చెందుతాయి.. 1956కి ముందు కలిసున్నంత మాత్రాన మరణించిన వ్యక్తి సోదరుడికి బదిలీ చేయబడవు’ అని తెలిపింది. ‘ఈ కేసులో వివాదంలో ఉన్న ఆస్తి మారెప్ప గౌండర్ స్వీయ ఆర్జిత ఆస్తిగా అంగీకరించాం.. అతని మరణం తర్వాత కుటుంబం ఉమ్మడిగా ఉన్నప్పటికీ అతడి ఏకైక కుమార్తె కుపాయి అమ్మాల్‌కు వారసత్వంగా దక్కుతుంది.. ఆస్తులను వేరెవరికీ పంపకం కుదరదు’’ అని స్పష్టం చేసింది. ‘‘ప్రాచీన గ్రంథాలతోపాటు స్మృతులు, అనేక మంది ప్రముఖులు రాసిన వ్యాఖ్యానాలు, న్యాయపరమైన ప్రకటనలు కూడా మహిళకు వారస్వత హక్కులను గుర్తించాయి.. భార్యలు, కుమార్తెలు వారిలో అగ్రగామిగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది.. ఇది వివాదాలకు దారితీయవచ్చు.. 1956కి ముందు విభజించబడిన ఆస్తులపై కుమార్తెలకు ఎటువంటి వాటా ఇవ్వలేదు..కుమార్తె వారసులు ఆస్తులపై వారి హక్కులను తిరిగి పొందాలని కోరవచ్చు’ అంటూ 1994లో దిగువ న్యాయస్థానం, 2009లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని కొట్టివేసింది.


By January 21, 2022 at 07:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-extends-womens-right-to-parents-property-prior-to-1956-act/articleshow/89029535.cms

No comments