Breaking News

సరిహద్దుల్లో భారత్ టీనేజర్‌ను కిడ్నాప్ చేసిన చైనా సైన్యం


సరిహద్దుల్లో చైనా సైన్యం ఆగడాలు కొనసాగుతున్నాయి. తాజాగా, భారత్ భూభాగంలోని అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ టీనేజర్‌ను సీపీఎల్‌ఏ అపహరించింది. వారి బారి నుంచి మరో యువకుడు త్రుటిలో తప్పించుకున్నాడని అరుణాచల్ ఎంపీ బుధవారం వెల్లడించారు. సియాంగ్ జిల్లా లుంగ్తా జోర్ ప్రాంతంలో అపహరణకు గురైన టీనేజర్‌ను మిరామ్ తరోన్ (17) గుర్తించారు. ఎంపీ ఫోన్ ద్వారా పీటీఐతో మాట్లాడుతూ.. పీఎల్ఏ నుంచి తప్పించుకున్న తరోన్ స్నేహితుడు జానీ యాయింగ్ ఈ విషయం గురించి అధికారులకు సమాచారమిచ్చాడని ఎంపీ తెలిపారు. మిరాన్ తరోన్, జానీ యాయింగ్‌‌లు జిడో గ్రామానికి చెందినవారని ఎంపీ తపిర్ గావ్ పేర్కొన్నారు. ఈ ఇద్దరూ వేటగాళ్లని, సాంగ్‌పో (బ్రహ్మపుత్ర) నది భారత్‌లోకి ప్రవేశించే ప్రాంతంలో జనవరి 18న ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. సాంగ్‌పో నదిని అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్ అని, అసోంలో బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. అంతకు ముందు ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తపిర్ తెలియజేశారు. ‘జనవరి 18న భారత్ భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సియాంగ్ జిల్లా సియాగ్లా పరిధి లుంగ్తా జోర్‌లోని గ్రామానికి చెందిన మిరామ్ తరోన్ అనే 17 ఏళ్ల వ్యక్తిని చైనా సైన్యం అపహరించింది...(ఈ ప్రదేశంలో భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా 3-4 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించింది)’ అని ట్వీట్ చేశారు. ‘అపహరణకు గురైన టీనేజర్‌ను త్వరగా వదిలిపెట్టేలా భారత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లను టాగ్ చేస్తూ మరో ట్వీట్‌ పెట్టారు. అంతేకాదు, ఈ విషయం గురించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్‌కు తెలియజేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. కాగా, 2020 సెప్టెంబరులో అరుణాచల్‌లోని ఎగువ సుబాన్షరీ జిల్లాకు చెందిన ఐదుగురు బాలుర్ని సైన్యం అపహరించి, వారం రోజుల తర్వాత వదలిపెట్టింది. భారత్, చైనాల మధ్య దాదాపు రెండేళ్లుగా సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.


By January 20, 2022 at 07:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/china-army-abducted-teen-from-inside-indian-territory-in-arunachal-says-mp-tapir-gao/articleshow/89007717.cms

No comments