Breaking News

భర్త బలవంతపెట్టినా ఇష్టం లేకుంటే శృంగారానికి నిరాకరించవచ్చు: ఢిల్లీ హైకోర్టు


వివాహితలు, అవివాహితల మహిళ గౌరవాన్ని వేర్వేరుగా చూడలేమని.. పెళ్లయినా.. లేకున్నా.. ఇష్టం లేని లైంగిక చర్యను నిరాకరించే హక్కు ప్రతి మహిళకూ ఉంటుందని స్పష్టం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ ఆర్ఐటీ ఫౌండేషన్, ఆల్ ఇండియా డెమొక్రాటిక్ ఉమెన్స్ ఫౌండేషన్ దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ రాజీవ్‌ శక్ధేర్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌ల ధర్మాసనం మంగళవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘పెళ్లయినంత మాత్రాన.. బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినా- మహిళ కేవలం ఇతర సివిల్‌, క్రిమినల్‌ చట్టాలనే ఆశ్రయించాలా? ఐపీసీ- 375 (అత్యాచారం) సెక్షన్‌ ఆ కేసులో వర్తించదా? ఇది సరికాదు’’ అని ధర్మాసనం ఉద్ఘాటించింది. వివాహమైనంత మాత్రాన ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కును మహిళలు కోల్పోతారా? అని ప్రశ్నించింది. ఐపీసీ సెక్షన్ 375 పరిధిలో భర్తలకు ఇచ్చిన మినహాయింపులు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘించేలా ఉన్నాయా? అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 50కిపైగా దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్న అంశాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఢిల్లీ ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది నందిత రావ్‌.. భర్తలకు ప్రస్తుతం ఉన్న మినహాయింపులను రద్దు చేయాల్సిన అవసరం లేదని వాదించారు. ఈ మినహాయింపులు భార్యల గౌరవానికి భంగం కలిగిస్తున్నట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. అంతేకాదు, ఐపీసీ సెక్షన్ 377, 498ఏ, 326 కింద భర్తలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసిన సందర్భాలున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ రాజీవ్ శక్ధేర్‌ జోక్యం చేసుకుంటూ ‘‘ఉదాహరణకు ఓ మహిళ నెలసరిలో ఉన్నప్పుడు.. భర్తతో శృంగారానికి నిరాకరించిప్పటికీ ఆయన బలవంతంగా ఆయన లైంగిక చర్యకు పాల్పడ్డారనుకోండి. అది నేరం కాదా?’’ అని ప్రశ్నించారు. ‘‘అది నేరమే. కానీ ఇది ఐపీసీ సెక్షన్ 375 (అత్యాచార చట్టం) పరిధిలోకి రాదు’’ అని నందిత బదులిచ్చారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘ఇదే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది.. సహజీవనం చేస్తున్న జంటలో యువతి శృంగారానికి నిరాకరించినప్పుడు అతడు బలవంతపెడితే ఈ చర్య ఐపీసీ సెక్షన్- 375 పరిధిలోకి వస్తుంది. వివాహిత విషయంలో ఎందుకు రాదు? సంబంధాన్ని బట్టి అలా చెప్పడం సరికాదు’’ అని అన్నారు. వివాహమైనా మహిళ గౌరవం దెబ్బతినదు.. స్త్రీ ఎప్పటికీ స్త్రీనే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై బుధవారం కూడా విచారణ కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది.


By January 12, 2022 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-high-court-questioned-dignity-of-a-married-woman-is-not-affected-as-an-unmarried-woman/articleshow/88845077.cms

No comments