Breaking News

స్కూళ్లు, కాలేజీలు, పార్క్‌లు క్లోజ్.. 50 శాతం సిబ్బందితోనే ఆఫీసులు


ఒమిక్రాన్ వేరియంట్‌తోపాటు, దేశంలో విస్తృతంగా పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకుంటున్నాయి. అనేక రాష్ట్రాలు ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించాయి. పండుగలు, వేడుకలపై నిబంధనలు పెట్టడమే కాకుండా నైట్ కర్ఫ్యూలు అమల్లోకి తెచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు వేయించుకోని వారిని బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు అవకాశం ఇవ్వడం లేదు. సభలు, సమావేశాలకు అనుమతించడం లేదు. తాజాగా ఈ జాబితాలోకి పశ్చిమ బెంగాల్ కూడా చేరింది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆ రాష్ట్రం లాక్‌డౌన్ తరహాలో ఆంక్షలు పెట్టింది. రాష్ట్రంలో సోమవారం నుంచి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, పార్కులు మూసివేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి హెచ్‌కే ద్వివేదీ ఆదేశాలు జారీ చేశారు. 50 శాతం సిబ్బందితో మాత్రమే ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు నడవాలని, సమావేశాలను, సభలను వర్చువల్‌గా నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే 50 శాతం సామర్థ్యంతో లోకల్ రైళ్లు సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే నడిపించాలి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఢిల్లీ, ముంబై నుంచి వారానికి రెండుసార్లు మాత్రమే విమానాలు నడుపుతుంది. ఇక ముందు కూడా దీనినే కొనసాగించనుంది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోవిడ్ కేసులపై స్పందించారు. ఆ రాష్ట్రంలో కేసులు వేగంగా పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన కేసులు తక్కువే ఉన్నాయన్నారు. అలాగే కోవిడ్ బాధితులకు వెంటనే వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని, 37 వేల పడకలను సిద్ధం చేశామని చెప్పారు. కాగా దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నమోదులో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. మొదటి నుంచి అక్కడ పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో ఇప్పటికే 27,553 కోవిడ్ కేసులు, 1525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.


By January 02, 2022 at 06:37PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/educational-institutions-parks-to-be-closed-in-west-bengal/articleshow/88649922.cms

No comments