Breaking News

డ్రోన్ దాడికి సౌదీ ప్రతీకారం.. హౌతీ రెబల్స్ కీలక నేత సహా 20 మంది హతం


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారుల డ్రోన్ దాడికి సంకీర్ణ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. సోమవారం హౌతి తిరుగుబాటుదారులు జరిపిన డ్రోన్ దాడుల్లో ఇద్దరు భారతీయుల సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే నాయకత్వంలోని సంకీర్ణ దళాలు ప్రతి దాడులు నిర్వహించాయి. హుతీ తిరుబాటుదారుల ఆధీనంలోని యెమెన్‌ రాజధాని సనాపై మంగళవారం ఎయిర్ స్ట్రయిక్స్ జరిపాయి. హౌతీ తిరుగుబాటుదారుల శిబిరాలు, ప్రధాన కార్యాలయాలే లక్ష్యంగా జరిపిన ఈ దాడుల్లో దాదాపు 25 మంది మృతి చెందినట్లు సమాచారం. రెబల్స్ మిలటరీలోని అత్యున్నత అధికారి, హౌతీల ఏవియేషన్ కాలేజీ మాజీ హెడ్ అబ్దుల్లా ఖాసిమ్ అల్ జునైద్ ఇంటిని లక్ష్యంగా వైమానిక దళం జరిపిన దాడుల్లో జునైద్, ఆయన భార్య, 25 ఏళ్ల వారి కుమారుడు, పౌరులు సహా దాదాపు 20 మంది మరణించినట్టు హౌతీ మీడియా తెలిపింది. 2019 తర్వాత సౌదీ సంకీర్ణ దళాలు జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని పేర్కొంది. దీంతోపాటు సౌదీవైపు ప్రయోగించిన ఎనిమిది డ్రోన్‌లను అడ్డుకున్నట్లు సంకీర్ణ దళాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమిలో యూఏఈ కూడా భాగస్వామిగా ఉంది. ‘వైమానిక దాడులతో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి.. 11 మంది మృతి చెందారు.. పలువురు గాయపడ్డారు.. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది’ అని బాధితుల బంధువు ఒకరు తెలిపారు. అటు, మృతుల సంఖ్యను వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. అబుదాబిపై జరిగిన డ్రోన్, క్షిపణి దాడులకు హుతీ తిరుగుబాటుదారులు బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సౌదీ సరిహద్దుల్లో తిరుగుబాటుదారులు పదేపదే దాడులకు పాల్పడుతున్నారు. అయితే సరిహద్దులు దాటి యూఏఈ విమానాశ్రయం సమీపంలో దాడిచేయడం ఇదే మొదటి సారి. అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాలు ఈ దాడులను ఖండించాయి. ఇక, 2015లో యెమెన్ రాజధాని సనాను హౌతీ తిరుగుబాటుదారులు ఆక్రమించినప్పటి నుంచి ఏడేళ్లుగా యుద్ధం నడుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు అబ్దరబూ మన్సూర్ హాదీ యెమెన్ వదిలి పారిపోవాయాడు. తర్వాత హౌతీ తిరుగుబాటుదారులు ఉత్తర యెమెన్‌లోని చాలా ప్రాంతాలపై పట్టు సాధించారు. అధ్యక్షుడు హాదీకి సౌదీ అరేబియా మద్దతు ఉంది. సౌదీ నేతృత్వంలో సంకీర్ణ సేనలు 2015లో హౌతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ సైన్యం ఇప్పటికీ దాదాపు రోజూ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. హౌతీ తిరుగుబాటుదారులు కూడా సౌదీ అరేబియాపై క్షిపణి దాడులు చేస్తున్నారు.


By January 19, 2022 at 08:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/more-than-20-killed-in-saudi-arabia-hits-back-at-houthi-rebels-after-uae-drone-attack/articleshow/88985743.cms

No comments