Breaking News

యుద్ధ నౌక రణ్‌వీర్‌లో పేలుడు: ముగ్గురు మృతి... 11 మందికి గాయాలు


ఇండియన్ నేవీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణ్‌వీర్‌‌లో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు నావికులు మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ముంబయిలోని నేవీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయానికి .. ముంబయి నేవల్ డాక్‌యార్డ్‌లోనే ఉన్నట్టు పేర్కొన్నారు. యుద్ధనౌకలోని అంతర్గత కంపార్ట్‌మెంట్‌లో ఈ పేలుడు సంభవించిందని నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. నౌకలోని సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపు చేసినట్టు పేర్కొంది. పేలుడు వల్ల నౌకలోని ఆయుధ సంపత్తికి పెద్దగా నష్టం జరగలేదని వివరించింది. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించామని తెలిపింది. నౌకలోని ఏసీ కంపార్ట్‌మెంట్‌లో గ్యాస్ లీక్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ‘‘పేలుడు జరిగిన ఏసీ కంపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న క్యాబిన్‌లో కూర్చుకున్నవారు ప్రాణాలు కోల్పోయారు.. ప్రమాదం ధాటికి క్యాబిన్ కూలిపోయింది.. అయితే, ఈ పేలుడుకు మందుగుండ సామాగ్రి కారణం కాదు’’ అని నేవీ వర్గాలు తెలిపాయి. తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ యుద్ధ నౌక.. విశాఖపట్నం కేంద్రంగా సేవలు అందిస్తోంది. ఈ నౌకలోని సిబ్బంది కూడా విశాఖలోనే నివాసం ఉంటున్నారు. ‘క్రాస్‌ కోస్ట్‌’ మోహరింపుల్లో భాగంగా గత ఏడాది నవంబరు నుంచి పశ్చిమ తీరంలో ఈ నౌక విధులు నిర్వర్తిస్తోంది. త్వరలోనే విశాఖ రేవుకు తిరిగి రావాల్సి ఉంది. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. రాజ్‌పుత్‌ క్లాస్‌కు చెందిన విధ్వంసక యుద్ధనౌకల్లో ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ నాలుగోది. రష్యా నిర్మించిన ఈ యుద్ధ నౌక.. 1986 అక్టోబరు 28న భారత నౌకాదళంలో చేరింది. అప్పటి నుంచి ఇది భారత నౌకదళంలో కీలక పాత్ర పోషిస్తోంది. రణ్‌వీర్ నౌకలో జలాంతర్గాములు, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, క్రూయిజ్ క్షిపణులను నిరోధించేలా క్యారియర్ టాస్క్ ఫోర్స్ రక్షణ కోసం యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ వంటి వ్యవస్థ ఉంటుంది.


By January 19, 2022 at 07:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-killed-and-11-injured-in-blast-on-navy-ship-ins-ranvir-in-mumbai/articleshow/88985336.cms

No comments