Breaking News

పాక్‌కు చెమటలు పట్టించే వార్త.. తొలి S-400 క్షిపణి వ్యవస్థను మోహరించిన భారత్


పొరుగునే ఉన్న పాకిస్థాన్, చైనా నుంచి నిత్యం ముప్పు పొంచి ఉన్న వేళ.. భారత అమ్ముల పొదిలో సరికొత్త ఆయుధం చేరింది. శత్రు క్షిపణుల అంతు తేల్చే ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పంజాబ్ సెక్టార్లో మోహరించింది. ఇది పక్కనున్న పాకిస్థాన్‌తోపాటు చైనా నుంచి గగనతల ముప్పును సమర్థవంతంగా అడ్డుకోగలదు. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో ఎస్‌–400 క్షిపణి వ్యవస్థ మనదేశానికి అండగా నిలవనుంది. భారత్ సుమారు రూ.35 వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఐదు స్క్వాడ్రన్ల ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేసేందుకు గతంలో రష్యాతో ఒప్పందం చేసుకుంది. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హయాం నుంచే అమెరికా భారత్‌ను హెచ్చరిస్తోంది. అయినప్పటికీ ఈ క్షిపణి వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా మన దేశం కొనుగోలుకే మొగ్గు చూపింది. ఇప్పటికే ఈ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ వినియోగంపై రష్యాలో భారత ఎయిర్ ఫోర్స్ అధికారులకు శిక్షణ పూర్తయింది. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, విమానాలు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ఎస్‌-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో పాకిస్థాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై భారత్ దాడులు చేయగలుగుతుంది. ఈ క్షిపణి వ్యవస్థను వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించే వీలుంది. డిసెంబర్ నెలారంభం నుంచి రష్యన్ మిస్సైల్ సిస్టమ్ విడిభాగాలు భారత్‌కు చేరుకోవడం మొదలైంది. ఎస్-400 మిస్సైల్ వ్యవస్థ మరికొద్ది వారాల్లో పని ప్రారంభించనుంది. తొలి స్క్వాడ్రన్ డెలివరీ 2021 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. తొలి స్వ్వాడ్రన్ ఏర్పాటు తర్వాత.. తూర్పు సరిహద్దులపై ఎయిర్ ఫోర్స్ దృష్టి సారించనుంది. అమెరికా థాడ్ వ్యవస్థ కంటే ఎస్-400 నమ్మదగిందని సైనిక రంగ నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే టర్కీ, చైనా లాంటి దేశాలు ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను రష్యా నుంచి కొనుగోలు చేశాయి. రష్యాకు వ్యతిరేకంగా పని చేసే నాటో కూటమిలో టర్కీ భాగమైనప్పటికీ.. రష్యా నుంచి ఈ క్షిపణి వ్యవస్థన దిగుమతి చేసుకోవడాన్ని బట్టి దీని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా లాంటి దేశాలు సైతం ఎస్-400 వ్యవస్థ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి. ఎస్‌-400 వ్యవస్థ ఒక పెద్ద బ్యాటరీ, దీర్ఘశ్రేణి రాడార్‌తోనూ, టార్గెట్‌ను గుర్తించే రాడార్‌ను కలిగి ఉండి ప్రతి లాంచర్‌కి నాలుగు ట్యూబులు ఉంటాయి. కమాండర్‌ పోస్టు వాహనంలో 8మందితో కూడిన రెండు బెటాలియన్లు ఉంటాయి. కమాండర్‌ పోస్టు, రాడార్లు, లాంచర్లు ఎత్తు పల్లాలు ఉండే భూభాగం మీద కూడా ప్రయాణించగలదు.


By December 21, 2021 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-air-force-deploys-first-s-400-missile-defence-system-in-punjab/articleshow/88403128.cms

No comments