Breaking News

‘అందంగా ఉంటారు.. అది తెలియదా’ మహిళా ఎమ్మెల్యేపై నోరుజారిన సీఎం!


సౌమ్యుడిగా గుర్తింపు పొందిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. వివాదాలకు దూరంగా ఉంటారు. అటువంటింది తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళా ఎమ్మెల్యే ఆరోపించడం సంచలనంగా మారింది. మిత్రపక్షం బీజేపీకి చెందిన ఎమ్మెల్యేనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సోమవారం నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో కటోరియాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రం.. మహువా (స్థానికంగా ఒక రకమైన మద్యం) నిషేధంపై మాట్లాడారు. ఉపాధి కోసం దీనిపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ అవకాశాలను కల్పించాలని కోరారు. ఈ సమయంలో సీఎం నితీష్ కుమార్ కలగజేసుకుంటూ.. మీరు చూడటానికి అందంగా కనిపిస్తారు, కానీ ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలియదని ఎద్దేవా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ శాసనసభ శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం మహిళా ఎమ్మెల్యే ఈ అంశాన్ని ప్రస్తావించారు. సీఎం ప్రవర్తన బాధ కలిగించిందని, ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ఆరోపణలపై జేడీయూ మహిళా నేత లేసీ సింగ్ స్పందించారు. ఎమ్మెల్యే హెంబ్రం గందరగోళానికి గురై ఉంటారని.. ముఖ్యమంత్రికి ఆమెను అవమానించే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. మరోవైపు, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌ కుమార్తె రోహిణి ఆచార్య.. ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ఈ వయసులోనూ చాచా అపఖ్యాతి పాలవుతున్నారని ఆమె ట్వీట్ చేశారు. బిహార్‌కు పేద రాష్ట్ర హోదా ఇచ్చిన మూడో నెంబరు పార్టీ అధినేత.. మహిళల అందం మెచ్చుకునే దగ్గరే ఉండిపోయారు అని ఆమె ఎద్దేవా చేశారు. ఆర్జేడీ సైతం వ్యంగ్యాస్త్రాలు సంధించింది.. ‘ఓ మహిళా బీజేపీ ఎమ్మెల్యేను సీఎం నితీశ్ కుమార్ ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అనే వ్యాఖ్య ఎలా ఉందో తెలుసా?’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.


By December 05, 2021 at 11:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-cm-nitish-kumar-allegedly-called-bjp-women-mla-beautiful-during-meeting/articleshow/88101776.cms

No comments