Breaking News

తైవాన్ మంత్రి చర్యతో ఉలికిపాటు.. చైనాకు భయపడి ప్రసంగాన్ని నిలిపివేసిన అమెరికా!


దక్షిణ చైనా సముద్రంలోని స్వయంపాలిత దీవి తైవాన్‌పై ఆధిపత్యం చెలాయించి, తన దారికి తెచ్చుకోడానికి డ్రాగన్ ఇటీవల కాలంలో దూకుడు పెంచిన విషయం తెలిసిందే. చైనా చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. తైవాన్‌కు పూర్తి సహాయసహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గతవారం అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. ఈ సదస్సుకు చైనాకు బదులు తైవాన్‌ను ఆహ్వానించి బైడెన్‌ సర్కారు సంచలనం సృష్టించింది. కానీ, తైవాన్‌ మంత్రి ప్రసంగిస్తున్న వేళ అర్థాంతరంగా వీడియోను నిలిపివేసి.. మాకేమీ సంబంధం లేదంటూ ఓ ప్రకటన చేసి చివరకు చేతులు దులుపుకుంది. ఈ విషయాన్ని బయటపెట్టిన అమెరికా స్థానిక మీడియా.. చైనాకు భయపడే ఇలా చేశారని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య సదస్సులో తైవాన్‌ డిజిటల్ మంత్రి ఆడ్రీ టాంగ్‌ పాల్గొని వీడియో సందేశం ఇచ్చారు. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన ఒక మ్యాప్‌ను చూసి వైట్‌హౌస్ అధికారులు షాక్‌ తిన్నారు. ఆ మ్యాప్‌లో చైనా, తైవాన్‌లు వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. సున్నితమైన అంశం కావడంతో ఇది అమెరికా ‘వన్‌ చైనా పాలసీ’కి విరుద్ధమంటూ వెంటనే ఆమె ప్రసంగం వీడియో లైవ్‌ను నిలిపివేశారు. ఆ మ్యాప్‌ను తొలగించాలని కోరారు. ఈ గందరగోళంలో మంత్రి ప్రసంగం వీడియో మొత్తం పోయి కేవలం ఆడియో మాత్రమే వినిపించింది. దీనిపై వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు వెల్లడించిన అభిప్రాయాలు వారి సొంతం.. అమెరికా అభిప్రాయాలను ఏ మాత్రం ప్రతిబింబించవు’’ అని అందులో పేర్కొంది. చైనా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న తైవాన్.. ఆమెరికా ఆతిథ్యం ఇచ్చిన సమావేశంలో మ్యాప్‌ను వేరుగా చూపడంతో వైట్ హౌస్ ఆందోళన చెందింది. అమెరికా ‘వన్-చైనా పాలసీ’ ప్రకారం చైనాలో తైవాన్ భాగమనేని పరోక్షంగా అంగీకరించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై విదేశాంగ శాఖ వివరణ ఇస్తూ.. టాంగ్ స్క్రీన్ షేరింగ్‌తో గందరగోళం నెలకుందని, దీంతో వీడియోను నిలిపివేశామని పేర్కొంది. ఇది నిజంగా తప్పిందమేనని తెలిపింది. ‘పారదర్శక పాలన, మానవ హక్కులు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం వంటి అంశాలపై ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని ప్రదర్శించిన టాంగ్ భాగస్వామ్యానికి మేము విలువనిచ్చాం’ అని చెప్పింది. తైవాన్‌ మంత్రి టాంగ్‌ చూపిన మ్యాప్‌ను దక్షిణాఫ్రికాకు చెందిన ‘సివికస్‌’ అనే ఎన్‌జీవో తయారు చేసింది. దీనిలో ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛా, మానవ హక్కులకు సంబంధించిన ర్యాంకులను ఇచ్చింది. ఇవి చైనా, తైవాన్‌ను వేర్వేరు రంగుల్లో చూపిస్తున్నాయి. ఈ మ్యాప్‌లో తైవాన్‌ సహా చాలా వరకూ ఆసియా ప్రాంతం ఆకుపచ్చ రంగులో ఉండగా.. చైనా, ఉత్తర కొరియా, లావోస్, వియత్నాంలు ఎరుపు రంగులో ఉన్నాయి. విశ్వసనీయ వర్గాలు రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ఈ మ్యాప్ తైవాన్‌ను ఒక ప్రత్యేక దేశంగా చూపుతున్నట్టు కనిపించడం అమెరికా అధికారులలో గందరగోళాన్ని సృష్టించింది.. ఆగ్రహానికి గురైన వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC) విదేశాంగ శాఖను సంప్రదించింది’ అని తెలిపారు. అలాగే, తైవాన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నాయి.


By December 13, 2021 at 02:13PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-fears-about-disappearing-taiwan-minister-with-curious-case-of-map-at-democracy-summit/articleshow/88254255.cms

No comments