Breaking News

భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం.. ఆ రాష్ట్రంలో 52 ఏళ్ల వ్యక్తి మృతి


దేశంలో తొలి మరణం నమోదయ్యింది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతిచెందాడు. పింప్రి-చించువాడ మున్సిపాల్టీ పరిధికి చెందిన 52 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు మహారాష్ట్ర నిర్ధారించింది. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తికి ఒమిక్రాన్ ఉన్నట్టు తెలిపింది. మరోవైపు, గురువారం దేశంలో కొత్తగా 258 ఒమిక్రాన్ కేసులు బయటపడగా.. ఒక్క మహారాష్ట్రలోనే 198 నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సంఖ్య 1,200కి సమీపించింది. పంజాబ్, బిహార్‌లో తొలిసారి ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తిచెందిన రాష్ట్రాల సంఖ్య 24కి చేరింది. మహారాష్ట్రలో వరుసుగా రెండో రోజు పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో కలిసి అక్కడ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి చేరింది. మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత గురువారం అత్యధికంగా హరియాణాలో 23 కేసులు బయటపడ్డాయి. తెలంగాణ, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌లో ఐదు చొప్పున, బిహార్, పంజాబ్‌లో ఒక్కొక్కటి నిర్ధారణ అయ్యాయి. పింప్రీ-చించువాడకు చెందిన బాధితుడు స్థానిక యశ్వంతరావు చవాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబరు 28న చనిపోయినట్టు అధికారులు తెలిపారు. నైజీరియా నుంచి వచ్చిన అతడికి తొలుత కోవిడ్ పాజిటివ్ రాగా.. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని చెప్పారు. అతడు గత 13 ఏళ్ల నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్నాడని పేర్కొన్నారు. ‘బాధితుడు మరణానికి కోవిడ్ కారణం కాదు.. కానీ, యాదృచ్ఛికంగా పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబొరేటరీ నివేదిక అతడికి ఓమిక్రాన్ వేరియంట్‌ సోకినట్లు నిర్ధారించింది’ అని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ఆరోగ్య నిపుణులు మాత్రం ఆ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో కోవిడ్ మరణంగా వర్గీకరించే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు, మహారాష్ట్రలో నమోదయిన మొత్తం ఒమిక్రాన్ కేసుల్లో 46 శాతం మంది అంతర్జాతీయ ట్రావెల్ హిస్టరీ ఉన్నవారే. ఢిల్లీలో గురువారం 25 మందికి కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. ఢిల్లీలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి దశలోకి ప్రవేశించదనే సంకేతాలు వెలువడుతున్నాయి. అక్కడ నమోదయిన కోవిడ్ కేసుల్లో 54 శాతం వరకూ ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు.


By December 31, 2021 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-records-first-omicron-variant-death-in-maharashtra/articleshow/88604696.cms

No comments