Breaking News

బాబ్రీ మసీదు కూల్చివేత.. సరిగ్గా 30 ఏళ్ల కిందట ఈ రోజునే


అయోధ్య వివాదానికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని 1992 డిసెంబర్ 6 న బాబ్రీ మసీదును కూల్చివేశారు. హిందూ జాతీయవాద సంస్థలు నిర్వహించిన రాజకీయ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో అయోధ్యలోని బాబ్రీ మసీదు వారి లక్ష్యంగా మారింది. అప్పటికే ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం డిసెంబరు 6న అనూహ్య మలుపు తిరిగింది. హిందువుల విశ్వాసాల ప్రకారం అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం. ఈ ప్రదేశంలోని ఆలయాన్ని కూల్చి 16 వ శతాబ్దంలో మసీదును నిర్మించారనేది ప్రధాన వాదన. అయితే, ఈ మసీదును ఇస్లామేతర నిర్మాణం ఉన్న స్థలం లోనే నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. 1980 వ దశకంలో విశ్వ హిందూ పరిషత్ విహింప ఈ ప్రదేశంలో రాముడికి ఒక ఆలయాన్ని నిర్మించాలని ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. దీనికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయంగా గొంతు కలిపింది. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వాణీ చేపట్టిన దేశవ్యాప్త ‌రథ‌యాత్ర ఈ ఉద్యమానికి విశేష ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. రథయాత్ర సహా పలు ప్రదర్శనలు, కవాతులూ జరిగాయి. బాబ్రీ మసీదు వద్ద 1992 డిసెంబరు 6 న 1,50,000 మంది కరసేవకులతో ఒక ప్రదర్శన నిర్వహించారు. ఇది హింసాత్మకంగా మారడంతో ఆందోళనకారులు పోలీసులను పక్కకు నెట్టి మసీదులోకి చొరబడి దానిని కూల్చివేశారు. ఈ సంఘటనలో ఎల్కే అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి బీజేపీ సీనియర్ నేతలు, వీహెచ్‌పీ నేతలు సహా 68 మందిని నిందితులుగా చేర్చారు. కానీ, ఈ మసీదు కూల్చివేత దేశంలో మత ఘర్షణలకు ఆజ్యం పోసింది. దేశంలో కొన్ని నెలల పాటు హిందూ, ముస్లిముల మధ్య మతకలహాలు జరిగాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో హిందువులపై ప్రతీకార దాడులు జరిగాయి. బాబ్రీ కూల్చివేతకు ఆర్‌ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ అగ్రనేతలు 10 నెల ముందుగానే ప్రణాళిక వేసుకున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి మలోయ్ కృష్ణ‌ధర్ 2005 మార్చిలో రాసిన పుస్తకంలో ఆరోపించారు. కాగా, ఏటా రోజును బ్లాక్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. ఇక, 2018లో సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదం సమసిపోయింది. వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు ఇచ్చింది. అలాగే, మసీదు నిర్మాణానికి యూపీ ప్రభుత్వం స్థలం కేటాయించాలని ఆదేశించింది. దీంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.


By December 06, 2021 at 08:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/black-day-6th-december-babri-mosque-demolition-anniversary/articleshow/88114392.cms

No comments