Breaking News

West Bengal కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసిన మంత్రి సుబ్రతా ముఖర్జీ


పశ్చిమ్ బెంగాల్ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సంబంధిత కారణాలతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు సీఎం తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే మమతా బెనర్జీ ఆస్పత్రికి చేరుకున్నారు. సుబ్రతా ముఖర్జీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఆమె.. ఆయన ఇక లేరన్న వార్తను నమ్మలేకపోతున్నానన్నారు. సుబ్రతా ముఖర్జీ ఎంతో నిబద్ధత కలిగిన నేత అని దీదీ కొనియాడారు. సుబ్రతా ముఖర్జీ మరణం తనకు వ్యక్తిగతం ఎంతో నష్టమని, ఆయనలేని లోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబరు 24న తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తడంతో సుబ్రతా ముఖర్జీ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స అందించినట్టు ఎస్ఎస్‌కేఎం వైద్యులు వెల్లడించారు. నవంబరు 1న ఆయనకు ఏంజియోప్లాస్టీ చేశారని, గురువారం రాత్రి 9.22 నిమిషాలకు కార్డియాక్ అరెస్ట్‌తో సుబ్రతా ముఖర్జీ కన్నుమూశారని బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ తెలిపారు. ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖతో పాటు మరో మూడు శాఖలను సుబ్రతా ముఖర్జీ పర్యవేక్షిస్తున్నారు. సుబ్రతా పార్ధీవదేహాన్ని ప్రజల సందర్శనార్ధం కోల్‌కతాలోని రబీంద్ర సదన్‌కు శుక్రవారం ఉదయం తరలించనున్నారు. అనంతరం బల్లీగంజేలోని పూర్వీకుల నివాసానికి తరలించి, అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక, మే నెలలోనూ తీవ్ర అస్వస్థతో సుబ్రతా ముఖర్జీ ఆస్పత్రిలో చేరారు. కోలుకున్న తర్వాత నారద ముడుపుల కేసులో ఆయనను సీబీఐ అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై విడుదలయ్యారు. ఇందిరా గాంధీ రెండోసారి ప్రధాని అయినప్పుడు 1970 దశకంలో కాంగ్రెస్ నుంచి సుబ్రతా ముఖర్జీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమయ్యింది. సుబ్రతా ముఖర్జీ, సౌమిన్ మిత్రా, ప్రియరంజన్ దాస్ మున్షీలు బెంగాల్ కాంగ్రెస్‌లో త్రిమూర్తులుగా గుర్తింపు పొందారు. 2008లో సౌమిన్, 2010లో సుబ్రతాలు కాంగ్రెస్‌ను వీడి తృణమూల్‌‌లో చేరారు. అయితే, సౌమిన్ తిరిగి 2014లో కాంగ్రెస్‌‌లో చేరారు. ఇక, ప్రియరంజన్ దాస్ మున్షీ 2017లో, సౌమిన్ 2020లో కన్నుమూశారు.


By November 05, 2021 at 07:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-minister-subrata-mukherjee-dies-due-to-cardiac-arrest/articleshow/87531301.cms

No comments