Breaking News

New Strain కొత్తరకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలి.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు


దాదాపు రెండేళ్లుగా ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి.. జన్యుమార్పిడిలకు గురవుతూ మరింత కలవరపెడుతోంది. తాజాగా, దక్షిణాఫ్రికా, బోట్సవానా, హాంకాంగ్‌లో వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మూడు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులకు తప్పనిసరిగా స్క్రీనింగ్‌, కొవిడ్‌ పరీక్షలు పకడ్బందీగా చేయాలని ఆదేశించింది. దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్‌ నుంచి వచ్చేవారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దక్షిణాఫ్రికాలో గుర్తించిన B.1.1529 కొత్త వేరియంట్‌ అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురవుతోంది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం (NICD) వెల్లడించింది. అసాధారణంగా మ్యుటేషన్‌కు గురవుతున్న ఈ వేరియంట్ దేశంలోని ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా వీసా నిబంధనలు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ వేరియంట్ కేసులు బోట్సవానాల మూడు, హాంకాంగ్‌లో ఒకటి ఇప్పటి వరకూ గుర్తించారు. ‘నవంబరు 11న అంతర్జాతీయ రాకపోకలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ దేశాల నుంచి ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణీకులందరూ (భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు ప్రమాదంలో ఉన్న దేశాల జాబితా) ,ఇతర ‘ప్రమాదకర’ దేశాల నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి’ అని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు గురువారం ఓ లేఖను పంపారు. ఒకవేళ, ఈ ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారి నమూనాలను జన్యు విశ్లేషణ కోసం పంపాలని తెలిపారు. జన్యు విశ్లేషణ ఫలితాలను వేగవంతం చేయడం కోసం రాష్ట్ర నిఘా అధికారులు నిర్దేశిత జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లతో సమన్వయాన్ని ఏర్పరచుకోవాలని కూడా సూచించారు.


By November 26, 2021 at 07:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-calls-for-tighter-screening-for-new-strain-travellers-from-3-nations/articleshow/87921115.cms

No comments