Breaking News

Imran Khan నరమేధానికి పాల్పడినవారితో చర్చలా.. ప్రధానికి సుప్రీంకోర్టు అక్షింతలు!


తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్‌ () ఉగ్రవాదులు 2014లో పెషావర్‌లోని పాక్ సైనిక స్కూల్‌పై దాడికి తెగబడి.. మారణహోమం సృష్టించి 147 మందిని ఊచకోత కోశారు. వీరిలో 132 మంది చిన్నారులే ఉన్నారు. ఈ ఘాతుకానికి ఏడేళ్లు కావస్తున్నా.. పాకిస్థాన్ ప్రభుత్వం దోషులను ఇప్పటికీ పట్టుకోలేకపోయింది. దీంతో బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ ఆ దేశ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాటి విచారణకు పాక్ ప్రధాని కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్‌పై న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు 150మంది చిన్నారుల నరమేధానికి పాల్పడిన వారితో ఎందుకు సంప్రదింపులు జరుపుతున్నారంటూ నిలదీశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతనెల ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ప్రధాని నేరుగా న్యాయస్థానానికి హాజరై సమాధానమివ్వాలంటూ సమన్లు జారీ చేసింది. దీంతో విషయం తెలుసుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌.. ఆదేశాలు అందిన కొన్ని గంటల్లోనే సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. అనంతరం పెషావర్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (APS) ఘటనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలని త్రిసభ్య ధర్మాసనం ప్రధానమంత్రిని అడిగింది. ఈ సందర్భంగా ఆయనపై త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు ఇప్పటికే పరిహారం అందజేశామని, మారణకాండ తర్వాత జాతీయ కార్యాచరణను కూడా తీసుకువచ్చామని పాక్ ప్రధాని కోర్టుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై స్పందించిన చీఫ్‌ జస్టిస్‌ గుల్జార్.. బాధిత తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి కోరుకుంటోంది పరిహారం కాదన్నారు. ఘటన రోజు జరిగిన భద్రతాలోపం గురించి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు..? వీటిపై గతంలో కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కనీస చర్యలు కూడా తీసుకోలేదని చీఫ్‌ జస్టిస్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నరమేధంలో భాగస్వామ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు.. అక్టోబరు 20న కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని చీఫ్‌ జస్టిస్‌ తీవ్రంగా తప్పుబట్టారు. కాగా, బాధిత చిన్నారుల తల్లిదండ్రులను కలిశానని.. భవిష్యత్తులోనూ వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తానని ఇమ్రాన్‌ ఖాన్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ధర్మాసనం కౌంటరిచ్చింది. ‘80వేల మంది ప్రజలు ఎలా మరణించారో తెలుసుకోండి.. పాకిస్థాన్‌లో 480 డ్రోన్‌ దాడులకు బాధ్యులెవరో తెలుసుకోండి’ అని ధర్మాసనం ముందు వ్యాఖ్యానించారు. దీనికి చీఫ్‌ జస్టిస్‌ ఘాటుగా స్పందిస్తూ.. ‘ఈ విషయాలు తెలుసుకోవాల్సింది మీరు.. మీరు ప్రధానమంత్రి. ఇలాంటి ప్రశ్నలకు ఓ ప్రధానిగా మీ దగ్గర సమాధానం ఉండాలి’ అంటూ ఇమ్రాన్‌ ఖాన్‌కు చురకలు అంటించారు. ‘మిస్టర్‌ ప్రధాన మంత్రి.. మనది చిన్న దేశం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం కలిగిన దేశాల్లో ఆరో స్థానంలో ఉన్నాం.. అయినప్పటికీ మారణకాండకు పాల్పడిన వారితో సంప్రదింపులు జరపడమేంటి? అలాంటి వారితో మీరు చర్చలు జరుపుతున్నట్లు మీడియాలో నివేదికలు వచ్చాయి’ అని ఇమ్రాన్ ఖాన్‌ను ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ క్వాజి మహమ్మద్‌ ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ఈ విషాదంపై ఉన్నతస్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే, ఇప్పటికే కమిషన్‌ వేశామని.. నివేదిక కూడా అందజేసిందని ఇమ్రాన్‌కు న్యాయమూర్తి గుర్తుచేశారు. ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రభుత్వం కనిపెట్టి వారిపై చర్యలు చేపట్టాలని గత నెల 20నే ఆదేశాలు ఇచ్చామని.. ఆ దారుణ ఘటన జరిగి ఇప్పటికే ఏడేళ్లు గడుస్తున్నా పురోగతి శూన్యమని ఆవేదన వ్యక్తం చేసింది. తెహ్రీన్‌-ఏ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (TTP) నిషేధిత సంస్థతో సంపూర్ణ కాల్పుల విమరణ ఇప్పందం పూర్తయినట్టు పాక్‌ సమాచార మంత్రి ఫవాద్‌ ఛౌదురి ప్రకటించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది.


By November 11, 2021 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-supreme-court-grills-prime-ministr-imran-khan-on-talks-with-ttp/articleshow/87637925.cms

No comments