Breaking News

Farm Laws సాగు చట్టాల్లో ఏముంది? రైతులు వ్యతిరేకించడానికి కారణం ఏంటి?


కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిగా చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మూడు సాగు చట్టాలను రద్దుచేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న వేళ కేంద్రం వాటిని వెనక్కు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు ఏడాది నుంచి తిష్ట వేశారు. తమ కుటుంబాలతో తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. అన్నదాతల ఆందోళనలు విరమించాలని విజ్ఞ‌ప్తి చేసిన కేంద్రం.. వారితో చర్చలు జరిపింది. రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఈ చట్టాలను సవాల్ చేయడంతో విచారణ చేపట్టింది. అంతేకాదు, వీటిపై మధ్యంతర ఉత్తర్వులను వెలువరించిన సుప్రీంకోర్టు.. కొన్నాళ్లు నిలుపుదల చేసింది. ఇక, ఏడాది కాలంగా చేస్తున్న పోరాటంలో దాదాపు 700 మంది రైతులు చనిపోయారు. గత నెలలో ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేర్ హింసాకాండకు సాగు చట్టాలే మూలకారణం. అలాగే, జనవరి 26న ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు చట్టాలను రైతులు ఎందుకు వ్యతిరేకించారు? కొత్త చట్టాలు రైతులకు మేలు చేస్తాయని, వారి ఆదాయం పెరిగి ఆర్థికంగా బలపడతారని హామీ ఇచ్చినా ఆందోళనకు కారణం ఏంటి? అందులో ఏముంది? తదితర అంశాలు గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.. 1) రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద చట్టం: ఏ పంటలకైనా.. రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. దీనికి కాల పరిమితి కనీసం ఒక పంట కాలం నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఉంటుంది. రైతులు పంట వేయడానికి ముందే కొనుగోలుదారులతో ఒప్పందం చేసుకోవచ్చు. వివాదాల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ ఉంటుంది. ప్రభుత్వం ఏం చెబుతోంది? ☆ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు రైతులతో ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకొస్తాయి. దీంతో తమ పంట ఉత్పత్తుల అమ్మకాల విషయంలో రైతులకు భరోసా కలుగుతుంది. ☆ ముందే ధర తెలుసుకోవడం వల్ల రైతు తన పెట్టుబడిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ☆ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయి. ☆ అమ్మకాల ప్రక్రియలో ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రైతుల అభ్యంతరాలేమిటి? ★ ఈ చట్టం ద్వారా ఒప్పంద సేద్యం బలపడే ప్రమాదం ఉంది. కార్పొరేట్ కంపెనీలు ప్రపంచవ్యాప్త డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తీసుకొస్తాయి. అదే జరిగితే దేశంలో పంటల వైవిధ్యం దెబ్బతింటుంది. ★ ఇప్పటికే పత్తి, సోయా లాంటి పంటలు కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయాయి. ★ రసాయనాలు, యంత్రాలు, శుద్ధి, కమొడిటీ ట్రేడింగ్, సూపర్ మార్కెట్ల నిర్వహణను బడా సంస్థలే నిర్వహిస్తున్నాయి. వీటిని జవాబుదారీ చేయడం కష్టం. ★ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో బహుళజాతి సంస్థలే లాభపడ్డాయి. ఆయా ప్రాంతాల్లో, దేశాల్లో డిమాండ్‌లో హెచ్చుతగ్గులను ఆసరాగా చేసుకొని బడా కంపెనీలు ఉత్పత్తులను పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. 2) నిత్యావసర సరకుల (సవరణ) చట్టం: నిత్యావసరాల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, అమ్మకాల నియంత్రణ అధికారం కేంద్రానికి ఉంటుంది. ప్రభుత్వం ఏం చెబుతోంది? ☆ వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూనే నిత్యావసరాలపై నియంత్రణ వ్యవస్థను సరళీకరిస్తాం. ☆ వ్యవసాయ రంగంలో పోటీ ఏర్పడుతుంది. తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది. ☆ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి సదుపాయాలు పెరుగుతాయి. తద్వారా పంట వ్యర్థాలు పెద్ద మొత్తంలో తగ్గుతాయి. రైతుల అభ్యంతరాలు: ★ దళారులు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించే ప్రమాదం ఉంది. ★ ఇటీవల ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన సందర్భంలో ఇదే జరిగిందని, తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


By November 19, 2021 at 10:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/what-are-the-three-contentious-farm-laws-reason-behind-farmers-oppose/articleshow/87793772.cms

No comments