Breaking News

By Elections హిమాచల్‌లో బీజేపీకి ఊహించని షాక్.. కర్ణాటక సీఎం ఇలాకాలో కాంగ్రెస్ పాగా!


దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను చూస్తే పరిస్థితి కొంత మెరుగుపడగా.. బీజేపీకి హిమాచల్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ్ బెంగాల్‌లో అధికార టీఎంసీ, అసోంలో ఎన్డీయే‌లు తమకు తిరుగులేదని నిరూపించుకున్నాయి. మమతా బెనర్జీ, హిమంతబిశ్వ శర్మలు విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. బెంగాల్‌లో టీఎంసీ మొత్తం నాలుగు సీట్లనూ గెలుచుకోగా.. అసోంలో మిత్రపక్షాలతో కలిసి ఐదు సీట్లనూ కైవసం చేసుకుంది. బెంగాల్ విషయానికొస్తే మూడు చోట్ల బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు లక్షకు పైగా ఓట్లు సాధించారు. తృణమూల్‌కు 75 శాతం ఓట్లు రాగా.. బీజేపీకి కేవలం 14 శాతం ఓట్లే వచ్చాయి. బెంగాల్‌లోని రెండు సిట్టింగ్ స్థానాలను బీజేపీ కోల్పోయింది. కాషాయ పార్టీకి గట్టిపట్టున్న దినహతాలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహ.. 1.50 లక్షలకు పైచిలుక మెజార్టీ సాధించడం గమనార్హం. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి కాంగ్రెస్‌ షాక్‌ ఇచ్చింది. మండి లోక్‌సభ స్థానంలో విజయభేరి మోగించింది. 2019 ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్‌ శర్మ 4.05 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన మృతితో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి, హిమాచల్‌ మాజీ సీఎం వీరభద్రసింగ్‌ భార్య ప్రతిభాసింగ్‌ గెలుపొందారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక సిటింగ్‌ అసెంబ్లీ సీటును కూడా బీజేపీ కోల్పోయింది. మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్‌ తన రెండు స్థానాలను నిలబెట్టుకుని, అధికార బీజేపీకి చెందిన మరో సీటును కూడా తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు, కర్ణాటకలో బీజేపీ సిటింగ్‌ సీటును కూడా కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై సొంత జిల్లా హావేరిలోని హానగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస మానె 7,426 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. విజయపుర జిల్లా సిందగి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రమేశ్‌ భూసనూరు 31,088 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా సిటింగ్‌ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ నిలుపుకొంది. ఇక్కడ కాంగ్రెస్‌కు చెందిన రెండు అసెంబ్లీ సీట్లను కూడా కాషాయ పార్టీ గెలుచుకుంది. దాద్రా నగర్‌ హవేలీలో ఆత్మహత్యకు పాల్పడిన స్వతంత్ర ఎంపీ మోహన్‌ దేల్కర్‌ భార్య కళాబెన్‌ దేల్కర్‌ శివసేన తరఫున బరిలో నిలిచి విజయం సాధించారు. దీంతో శివసేన పార్టీ తొలిసారి మహారాష్ట్ర వెలుపల ఒక ఎంపీ సీటును గెలుచుకున్నట్లయింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 3 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 30న ఉప ఎన్నికలు జరగ్గా.. మంగళవారం ఫలితాలు వెల్లడించారు. రాజస్థాన్‌లో 2 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటినీ కాంగ్రెసే గెలుచుకుంది. ఇందులో ఓ స్థానం బీజేపీది కావడం విశేషం. బిహార్‌లో అధికార జేడీయూ తన రెండు అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకుంది.


By November 03, 2021 at 08:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/setback-for-bjp-congress-suprising-victory-in-by-elections-in-some-states/articleshow/87499108.cms

No comments