Breaking News

Border పాక్ కంటే చైనా నుంచే భారీ ముప్పు.. సీడీఎస్ చీఫ్ రావత్ సంచలన వ్యాఖ్యలు


భారత్‌కు పాకిస్థాన్ కంటే చైనాతోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అన్నారు. భూ సరిహద్దులు లేదా సముద్రంలో ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఎదుర్కొడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం టైమ్స్ నౌ సమ్మిట్‌లో పాల్గొన్న బిపిన్ రావత్.. ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ పై విధంగా స్పందించారు. చైనాను భారత్‌కు ప్రథమ శత్రువుగా భావిస్తున్నారా? అని ప్రశ్నించగా.. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఉత్తర సరిహద్దుల్లో ముప్పు చాలా ఎక్కువగా ఉందన్నారు. ‘ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొడానికైనా సిద్ధంగా ఉన్నాం.. ఒకవేళ గాల్వాన్ వంటి ఘటన మరోసారి పునరావృతమైతే గతంలో మాదిరిగానే వారికి తగిన గుణపాఠం తప్పదు’ అని రావత్ ఉద్ఘాటించారు. గతేడాది జూన్ 15న గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణను సీడీఎస్ చీఫ్ గుర్తుచేశారు. ఏడాదిన్నరగా సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య దౌత్య, సైనికపరమైన చర్చలు జరిగాయి. కొన్ని ప్రాంతాల నుంచి భారత్, చైనాలు తమ సైన్యాలను వెనక్కు మళ్లించాయి. అయితే, చైనా వైఖరితో ప్రక్రియకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యం మౌలికవసతుల నిర్మాణాలను చేపట్టడంతో ప్రతిష్టంభన కొనసాగుతోందని రావత్ తెలిపారు. దీంతో వరుసగా రెండో శీతాకాలంలోనూ ఎత్తైన వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత్ సైన్యం సంసిద్ధంగా ఉంది. ‘మేము ఇప్పటికే శీతాకాలం కోసం ఏర్పాట్లు చేసుకున్నాం.. ప్రత్యర్థి ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే దానిని ఎదుర్కోవడానికి మా వద్ద తగిన వనరులు ఉన్నాయి.. వెనక్కువెళ్లిన స్థానాలను చైనా మళ్లీ ఆక్రమించుకోవడంపై మేము ఆందోళన చెందుతున్నాం.. చైనా సైన్యం అక్కడ శాశ్వతంగా ఉండబోతున్నట్లయితే, మనం కూడా అలాగే ఉంటాం’ అని స్పష్టం చేశారు.


By November 13, 2021 at 12:33PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/china-biggest-security-threat-says-cds-chief-general-bipin-rawat/articleshow/87680925.cms

No comments