Breaking News

ప్రధానికి అరుదైన గౌరవం.. ప్రత్యేక రాగాన్ని సృష్టించి పేరుపెట్టిన గ్రామస్థులు


ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. మేఘాలయలోని కాంగ్‌థాంగ్‌ (విజ్లింగ్‌ విలేజ్‌) గ్రామానికి చెందిన ప్రజలు తమ సంప్రదాయం ప్రకారం.. మోదీకి ప్రత్యేక రాగంతో పేరు పెట్టారు. గ్రామాన్ని పర్యటకంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్న గౌరవర్థం ఈ పేరు పెడుతున్నట్లు సీఎం కొనరాడ్ సంగ్మా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌పై స్పందించిన ప్రధాని.. తనకు పేరు పెట్టినందుకు ఆ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు 60 కి.మీ దూరంలో కింగ్‌థాంగ్‌ గ్రామంలోని ఖాసీ తెగకు చెందిన ప్రజలకు పేర్లు ఉండవు. ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రాగంతో పిలుస్తుంటారు. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు ఒక రాగాన్ని సృష్టించి.. దానినే వారికి పేరుగా భావిస్తారు. తరతరాలుగా పూర్వీకుల నుంచి వచ్చిన ఈ సంప్రదాయాన్ని గ్రామస్థులు ఇంకా కొనసాగిస్తుడటం విశేషం. అందుకే ఈ గ్రామానికి ‘విజ్లింగ్‌ విలేజ్‌’ అనే పేరొచ్చింది. ఎత్తైన కొండలోయల్లో ఉన్న ఈ గ్రామం ప్రకృతి రమణీయతకు పెట్టిపేరు. దీంతో ప్రకృతిని ఆస్వాదించడానికి, ఇక్కడి ప్రజల సంప్రదాయాల్ని తెలుసుకోవడం కోసం పర్యాటకులు వస్తుంటారు. అలా ఈ గ్రామం పర్యటకంగానూ అభివృద్ధి చెందుతోంది. దీంతో ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహించే పోటీకి భారత్‌ తరఫున ఉత్తమ పర్యటక గ్రామంగా కింగ్‌థాంగ్‌ (విజ్లింగ్‌ విలేజ్‌) పేరును కేంద్రం నామినేట్‌ చేసింది. తమ గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న ప్రధాని మోదీకి ఆ గ్రామస్థులు ధన్యవాదాలు చెప్పాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ప్రత్యేకమైన రాగాన్ని సృష్టించి ప్రధానికి పేరు పెట్టారు. ఈ విషయాన్ని మేఘాలయ సీఎం ట్విటర్‌ వేదికగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ‘విభిన్నమైన రాగంతో పేరు పెట్టినందుకు ప్రజలకు కృతజ్ఞతలు. మేఘాలయ పర్యాటక రంగం అభివృద్ధికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ‘చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్’ అద్భుత చిత్రాలు కూడా నేను చూశాను. ఎంతో అందంగా ఉన్నాయి’’అని ప్రధాని ట్విట్‌లో పేర్కొన్నారు.


By November 29, 2021 at 11:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/meghalaya-whistling-village-kongthong-composes-special-tune-for-prime-minister-modi/articleshow/87974854.cms

No comments