Breaking News

ఢిల్లీ: స్కూల్స్ మూసివేత.. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోం.. లాక్‌డౌన్‌పై కేజ్రీ సంకేతాలు!


కాలుష్య భూతంతో దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వాయు కాలుష్యంపై సర్వోన్నత న్యాయస్థానం సైతం ఆందోళన వ్యక్తం చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. సోమవారం నుంచి రాష్ట్రంలోని మొత్తం పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. వారం రోజులపాటు ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, వీలైనంత వరకు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాలని ప్రైవేటు సంస్థలకు సూచించారు. వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో దుమ్మురేగకుండా అన్ని నిర్మాణ కార్యక్రమాలను సైతం నాలుగు రోజులపాటు నిలిపివేయాలని ఆదేశించారు. శనివారం ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించిన ఢిల్లీ సీఎం.. లాక్‌డౌన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారా? అన్న ప్రశ్నకు కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది.. కానీ, అటువంటి తీవ్రమైన నిర్ణయాన్ని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అమలు చేస్తామన్నారు. ‘ఈ సమయంలో లాక్‌డౌన్ విధించం.. అటువంటి చర్య ప్రభావాన్ని ముందుగా అంచనా వేయడం చాలా ముఖ్యం.. మేము ఈ అవకాశం గురించి ప్రతిపాదనను రూపొందిస్తున్నాం.. తదుపరి విచారణలో దానిని కోర్టు ముందుంచుతాం.. లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటే సంబంధిత అన్ని ఏజెన్సీలను సుదీర్ఘంగా సంప్రదిస్తాం.. లాక్‌డౌన్ పరిస్థితి వస్తే అన్ని వాహనాలు, పారిశ్రామిక, నిర్మాణ కార్యకలాపాలు మూసివేస్తాం’ కేజ్రీవాల్ అన్నారు. దీపావళి అనంతరం ఢిల్లీ, చుట్టుపక్కల గురుగావ్, నొయిడా, ఘజియాబాద్‌ సైతం తీవ్ర వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. వాయు కాలుష్యం అసాధారణంగా పెరిగిపోయి, గాలిలో నాణ్యత తగ్గిపోయింది. దీనిపై శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇళ్లల్లో కూడా మాస్కులు ధరించే పరిస్థితి నెలకుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాజకీయాలు చేయకుండా సత్వర చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఢిల్లీలో వాయు కాలుష్యానికి పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను పొలాల్లోనే దహనం చేయడమే కారణమని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కేంద్రం కోర్టుకు వెల్లడించింది. అయితే ఈ సమాధానంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘రైతుల వల్లే కాలుష్యం జరుగుతుందని ఎందుకు ఒక అంచనాకొస్తున్నారు? ఈ కాలుష్య పరిస్థితులకు అది ఒక కారణం మాత్రమే.. మిగతా వాటి గురించి ఏం చెప్తారు? కాలుష్య నియంత్రణకు ఏం చేస్తున్నారు? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానివ్వండి.. మీ ప్రణాళిక ఏంటో మాకు వెంటనే తెలియజేయండి.. రెండు రోజుల లాక్‌డౌన్ ఏమైనా విధిస్తారా?’ అంటూ నిలదీసింది.


By November 14, 2021 at 07:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-schools-shut-for-a-week-construction-ban-and-work-from-home-for-empolyees-due-to-pollution/articleshow/87692830.cms

No comments