Breaking News

అమెరికాలో కారు బీభత్సం.. క్రిస్మస్ పరేడ్‌‌పై దూసుకెళ్లిన వాహనం.. పలువురు మృతి


అగ్రరాజ్యం అమెరికాలో క్రిస్మర్ పరేడ్‌పైకి వాహనం దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. విస్కోన్సిన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికిపైగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం 4.30 గంటలప్పుడు వౌకేషా పట్టణం మిల్వాకీ శివారు ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఉగ్రవాదులతో సంబంధం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరుగుతుండగా బారికేడ్లను చేధించుకుంటూ ఓ ఎరుపు రంగు ఎస్‌యూవీ వాహనం దూసుకొచ్చిందని పోలీస్ ఉన్నతాధికారి డాన్ థాంప్సన్ తెలిపారు. వాహనం కింద 20 మందికిపైగా నలిగిపోయారని, వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు. అయితే, ఎంత మంది చనిపోయారనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఘటనలో 12 మంది చిన్నారులు సహా 23 మంది గాయపడినట్టు అగ్నిమాపక విభాగం ఉన్నతాధికారి స్టీవెల్ హోవార్డ్ చెప్పారు. వీరికి ఆరు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోందన్నారు. ఘటనకు కారణమైన వాహనం నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వాహనం స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. వాహనంలో పారిపోతున్న నిందితుడ్ని పట్టుకోడానికి కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు.. రెండు రోజుల పాటు సమీపంలోని పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రమాదం జరిగిన రోడ్డును కూడా మూసివేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఈ పరేడ్‌లో విస్కాన్సిన్ రాష్ట్ర కోశాధికారి పదవికి పోటీ చేస్తున్న ఏంజెలిటో టెనోరియో కూడా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఒక ఎస్‌యూవీ వేగంగా దూసుకురావడం కనిపించింది. ఆపై మేము పెద్ద శబ్దం విన్నాం.. వాహనం ఢీకొన్న వ్యక్తుల హాహాకారాలు, కేకలు వినిపించాయి’ అని అతను చెప్పాడు.


By November 22, 2021 at 10:35AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/some-dead-and-injured-due-to-suv-rams-christmas-parade-in-us/articleshow/87841857.cms

No comments