Breaking News

పాక్ ఆర్ధిక స్థితి దిగజారిందని ఒప్పుకుంటూనే.. భారత్‌లో పెట్రోల్ ధరలపై ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు


తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోవడంతో పాకిస్థాన్‌లో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్ధిక పరిస్థితిపై పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఇమ్రాన్‌ ఖానే స్వయంగా వెల్లడించారు. మంగళవారం ఇస్లామాబాద్‌లోని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ రెవెన్యూలో ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ సిస్టమ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావించారు. ‘మన దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే.. దేశాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సిన నిధులు మన వద్ద లేకపోవడమే. అందుకే అప్పులు చేయాల్సి వస్తోంది’’అని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. అప్పుల భారం పెరిగిపోతుండటం.. దేశంలో పన్నులు సరిగా వసూలు కాకపోవడం ‘జాతీయ భద్రత’ అంశంగా మారిందని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు తీసుకోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ఆర్థిక వనరులు లేకపోవడంతో ప్రజా సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయించలేకపోతున్నామని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు నెలల్లో ప్రభుత్వం 3.8బిలియన్‌ డాలర్లు అప్పు చేసిందని తెలిపారు. ఈ అప్పుల ఊబి నుంచి పాకిస్థాన్‌ బయటపడాలంటే ప్రజలు పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేందుకు ప్రజలు అనుమతించాలని ఇమ్రాన్ ఖాన్ వేడుకున్నారు. పెరుగుతున్న రుణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి పెట్రోల్ ధరలను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేకాదు, పాక్‌లోని ప్రస్తుత ధరలను భారత్, బంగ్లాదేశ్‌తో పోల్చారు. ఇతర దేశాలతో పోలిస్తే పాకిస్థాన్‌లో 'ఇంధనం ధర తక్కువగా ఉందని ఆయన అన్నారు. ‘పెట్రోలు ధరలు పెంచితేనే దేశ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతుంది.. పెంచాలి, లేకపోతే మా అప్పులు పెరుగుతాయని నేను మీకు చెబుతున్నాను.. కానీ దీన్ని భారత్ పోల్చి చూస్తే అక్కడ పెట్రోల్‌ను మన కరెన్సీలో లీటర్‌కు రూ.250, బంగ్లాదేశ్‌లో లీటరు రూ.200కి విక్రయిస్తున్నారు.పాక్‌లో రూ.138కి విక్రయిస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. పాక్ రూపాయి విలువ 44 భారత్‌లో పైసలతో సమానం. పాక్‌లో 22కోట్ల జనాభా ఉంటే.. అందులో కేవలం 30లక్షల మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నట్లు ఆ దేశ ఆర్థిక సలహాదారు షౌకత్‌ టరిన్‌ గతంలో వెల్లడించారు. వారిలో 15లక్షల మందికి పన్నులు వెంటనే చెల్లించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులు కూడా జారీ చేశారు.


By November 25, 2021 at 11:37AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/imran-khan-admits-dont-have-enough-money-to-run-pakistan-and-compares-to-india-fuel-prices/articleshow/87904591.cms

No comments