Breaking News

'భరోసా'పై స‌మంత ఫ్రెండ్ శిల్పా రెడ్డి కామెంట్స్ వైరల్.. అందుకు సెల్యూట్ అంటూ వీడియో పోస్ట్


స్టార్ హీరోయిన్ క్లోజ్ ఫ్రెండ్ ఆడబిడ్డల ‘భరోసా’ గురించి ఓపెన్ అయింది. కేంద్రాలకు, సభ్యులకు హ్యాట్సాఫ్‌ అని చెబుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఆడబిడ్డలకు భరోసా కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఆమె కొనియాడింది. హైదరాబాద్‌లోని ‘భరోసా’ కేంద్రాన్ని సందర్శించిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌, మోడల్‌, సమంత ఫ్రెండ్ శిల్పారెడ్డి ‘తెలంగాణ గడ్డ.. ఆడబిడ్డల భరోసాకు అడ్డా’ అని పేర్కొనడం గమనార్హం. ఈ సందర్భంగా ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని పోస్ట్ చేసింది శిల్పా రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల సంరక్షణను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడాన్ని తెలుగు బిడ్డగా గర్విస్తున్నానని ఆమె తెలిపింది. ''రాష్ట్రంలో మహిళలు, పిల్లలను రక్షించడానికి పోలీసులు చేస్తున్న కృషిని నేను దగ్గరుండి చూశా. అలాగే షీ టీమ్స్‌ ఆధ్వర్యంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించాక నా మనసులో ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. భరోసా కేంద్రాలను సందర్శించే మహిళల వివరాలు గోప్యంగా ఉంచుతూ వారి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నారు. గృహహింస, వేధింపులు, నేరాల నుంచి రక్షణ కల్పించడమే గాక వైద్య, న్యాయ సహాయం అందిస్తున్నారు. మహిళలకు కౌన్సెలింగ్‌ ఇస్తూ మనోబలాన్ని నింపుతున్నారు. భారత దేశంలోనే మహిళలకు ఈ తరహా రక్షణ వ్యవస్థ కల్పించిన ఏకైక రాష్ట్రం మనదే అని చెప్పుకోవడానికి గర్విస్తున్నా. ఇక్కడి పోలీసుల పని తీరుకు సెల్యూట్ చేయాల్సిందే. భరోసా కేంద్రాలకు, షీ టీమ్స్‌ సభ్యులకు హ్యాట్సాఫ్‌. భరోసా కేంద్రాల గురించి జనానికి తెలిసేలా చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నా'' అని శిల్పా రెడ్డి పేర్కొంది. సమంత ప్రాణ స్నేహితురాలిగా ఫేమ్ అయింది శిల్పా రెడ్డి. నాగ చైతన్యతో సామ్ విడాకుల ప్రకటన అనంతరం ఆమెతో దేశాలు చుట్టివస్తూ సరదాగా గడుపుతున్న శిల్ప.. ఇలా మహిళల భరోసా గురించి మాట్లాడటం సమంత అభిమానుల్లో మరింత ధైర్యాన్ని నింపుతోంది. ఆమె షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


By November 12, 2021 at 09:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-close-friend-shilpa-reddy-post-on-bharosa-centers-and-she-teams/articleshow/87659433.cms

No comments