Breaking News

బ్రిటిష్ నాటి పద్దతికి చెల్లు.. రాత్రివేళలోనూ పోస్ట్‌మార్టం.. కేంద్రం సంచలన నిర్ణయం


సూర్యాస్తమయం తర్వాత నిర్వహణకు అనుమతిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యవంతులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే.. వారి అవయవ దానం ద్వారా ఎనిమిది మంది రోగులకు ప్రాణదానం చేయవచ్చు. కిడ్నీలు దెబ్బతిన్న ఇద్దరికి డయాలసిస్‌ నుంచి ఉపశమనం.. కాలేయం అమరికతో ఇంకో ఇద్దరికి, ఊపిరితిత్తుతులతో మరో ఇద్దరికి ఊపిరి పోయొచ్చు. కళ్లు, క్లోమం, గుండె దానంతో ఇతరుల జీవితాలలో వెలుగులు నింపవచ్చు. అయితే, మృతదేహాలకు పోస్టుమార్టం ఆలస్యం కావడం, మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత అనుమతి లేకపోవడంతో కొన్నిసార్లు అవయవ దానానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అవయవ దానం ప్రాధాన్యతగా రాత్రిళ్లు సైతం ఆస్పత్రుల్లో పోస్టుమార్టం నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సోమవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే, ఇందుకు ఆస్పత్రుల్లో సరైన మౌలిక సౌకర్యాలు ఉండాలి. ముఖ్యమైన సాక్ష్యాలు భద్రంగా ఉంటాయని ఆస్పత్రి బాధ్యుడు నిర్ధారణకు రావాలి. భవిష్యత్తులో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేసి ఫుటేజీని దాచిపెట్టాలి. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని భావిస్తే తప్ప హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, బాగా దెబ్బతిన్న స్థితిలోని, అనుమానాస్పద మరణాల కేసుల్లో మృతదేహాలకు రాత్రి వేళ పోస్టుమార్టం చేసేందుకు వీల్లేదు. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు, ప్రక్రియలో భారాన్ని తగ్గి స్తూ జీవన సౌలభ్యాన్ని పెంపొందిచేందుకు రాత్రివేళ సైతం పోస్టుమార్టం నిర్వహణకు అనుమతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ‘‘బ్రిటీష్‌ కాలం నాటి పద్ధతికి చరమ గీతం పాడుతూ.. 24 గంటలూ పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం అనుమతించింది.. సుపరిపాలన అందజేయాలనే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా రాత్రివేళ సౌకర్యాలున్న ఆస్పత్రిలో సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్ట్‌మార్టం నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది’’ ఆయన అని ట్వీట్‌ చేశారు. ‘చనిపోయిన వారి స్నేహితులు, బంధువులే కాకుండా ఈ కొత్త విధానం అవయవ దానం, మార్పిడిని ప్రోత్సహిస్తుంది.. ఎందుకంటే ప్రక్రియ తర్వాత నిర్ణీత సమయంలో అవయవాలను సేకరించవచ్చు’ అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వివిధ వర్గాల వారి నుంచి వచ్చిన విజ్ఞ‌ప్తులను డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌కు చెందిన టెక్నికల్ కమిటీ పరిశీలించి, ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది.


By November 16, 2021 at 07:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-allowed-to-post-mortem-can-now-be-performed-after-sunset/articleshow/87727506.cms

No comments