Breaking News

1947లో వచ్చింది స్వాతంత్రం కాదంటూ నోరుజారిన కంగనాా.. తీవ్ర దుమారం


నోటిదురుసుతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశానికి అసలైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని.. 1947లో వచ్చింది కేవలం భిక్షేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ సహా పలువురు రాజకీయ నేతలూ ఆమెపై మండిపడ్డారు. బుధవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ.. ‘‘భారత్‌కు 1947లో వచ్చింది స్వాతంత్య్రం కానే కాదు.. అది భిక్ష.. మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది 2014లో (మోదీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు)’’ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల వైరల్‌గా మారింది. ఆమె కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆ పార్టీని బ్రిటిష్‌ పాలనకు కొనసాగింపుగా పేర్కొన్నారు. కంగన వ్యాఖ్యలను వరుణ్‌ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘మహాత్మా గాంధీ త్యాగాలను కంగన గతంలో అవమానించారు. ఆయన్ను కాల్చిచంపిన వ్యక్తిని కీర్తించారు. ఇప్పుడేమో సమరయోధుల త్యాగాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంగళ్ పాండే, రాణీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను అపహాస్యం చేశారు.. ఇదంతా ఒక రకమైన పిచ్చి అనుకోవాలా? దేశ ద్రోహంగా పరిగణించాలా’’ అని ట్విటర్‌లో గురువారం ఆయన మండిపడ్డారు. దీనిపై కంగన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. ‘‘1857 తిరుగుబాటు తొలి స్వాతంత్య్ర పోరాటం.. దాన్ని అణచివేశారు. ఆ తర్వాతి నుంచి బ్రిటిషర్ల అకృత్యాలు మరింత పెరిగాయి.. దాదాపు శతాబ్దం తర్వాత వారు గాంధీ ముష్టిపాత్రలో మనకు స్వాతంత్య్రం ఇచ్చారు.. ఇక వెళ్లి మరింత ఏడవండి’’ అని వ్యాఖ్యానించారు. కంగనా వ్యాఖ్యలపై పార్టీ తీవ్రంగా స్పందించింది. స్వాతంత్య్రంపై కంగన వ్యాఖ్యలు దేశద్రోహం పరిధిలోకే వస్తాయని కాంగ్రెస్‌ పేర్కొంది. ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ ఢిల్లీలో మాట్లాడుతూ.. కంగన దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని.. ఆమె తరఫున కేంద్ర సర్కారూ క్షమాపణలు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. ‘దేశంలోని చట్టం, భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి పద్మశ్రీ వంటి మహోన్నత పురస్కారం పొందేందుకు అర్హులు కాదు’’ అని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా వ్యాఖ్యానించారు. కంగన వ్యాఖ్యలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కార్యవర్గ సభ్యురాలు ప్రీతిశర్మ మీనన్‌ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశద్రోహం స్థాయి వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. కంగన వ్యాఖ్యలను శివసేన నేత ప్రియాంక చతుర్వేది కూడా తీవ్రంగా తప్పుపట్టారు.


By November 12, 2021 at 08:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-and-varun-gandhi-slams-actress-kangan-ranaut-comments-on-freedom-fight/articleshow/87657849.cms

No comments