Breaking News

సీబీఐ డైరెక్టర్‌కు షాక్.. సమన్లు జారీచేసిన ముంబయి పోలీసులు!


సుబోధ్ కుమార్ జైశ్వాల్‌కు మహారాష్ట్ర పోలీసులు సమన్లు జారీచేశారు. ఫోన్ ట్యాపింగ్, డేటా లీక్ కేసులో సైబర్ సెల్ పోలీసులు సమన్లు జారీచేసినట్టు తెలుస్తోంది. బాంబే హైకోర్టులో విచారణ జరుగుతున్న ఓ కేసులో ఫోన్ ట్యాపింగ్, డేటా లీక్ అయిన ఉదంతం రాజకీయ వివాదానికి దారి తీయడంతో ఈ-మెయిల్ ద్వారా సమన్లు పంపి, విచారణకు రావాలని ఆదేశించారు. వచ్చే గురువారం లోగా సీబీఐ డైరెక్టర్‌ను విచారణకు రావాలని కోరినట్టు అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్రలో పోలీసు బదిలీల్లో జరిగిన అవినీతి గురించి ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా తయారు చేసిన నివేదిక బహిర్గతం కావడం రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సుబోధ్ జైశ్వాల్ మహారాష్ట్ర డీజీపీగా ఉన్నారు. సీనియర్ రాజకీయ నేతలు, అధికారుల ఫోన్లను విచారణ సమయంలో చట్ట వ్యతిరేకంగా ట్యాప్ చేశారని, ఉద్దేశపూర్వకంగా నివేదిక లీక్ చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే, సైబర్ సెల్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో రష్మీ శుక్లా కానీ, మరే ఇతర అధికారి పేరు లేదు. ఇక, 1985 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సుబోధ్ జైశ్వాల్‌ను ఈ ఏడాది మేలో సీబీఐ డైరెక్టర్‌గా నియమించారు. జైస్వాల్ ముంబయి పోలీస్ కమిషనర్‌గానూ, మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు. గతేడాది పోలీస్ అధికారుల బదిలీ రాకెట్‌‌కి సంబంధించి అనుమానితుల కాల్ రికార్డులను మహారాష్ట్ర డీజీపీకి ఇంటిలిజెన్స్ కమిషనర్ నివేదికను పంపారు. తర్వాత ఈ నివేదికను ముఖ్యమంత్రికి డీజీపీ అందజేశారు. వీటిపై ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. జీఏడీ ద్వారా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దంటూ అడ్డుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.


By October 10, 2021 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cbi-director-subodh-kumar-jaiswal-summoned-by-mumbai-police-in-phone-tapping-data-leak-case/articleshow/86907482.cms

No comments