Breaking News

త్రిశూల్ మౌంట్ వద్ద హిమపాతం.. నేవీ పర్వతారోహణ బృందంలోని ఐదుగురు గల్లంతు


ఉత్తరాఖండ్‌ బగేశ్వర్ జిల్లా త్రిశూల్ శిఖరం సమీపంలో శుక్రవారం ఉదయం సంభవించింది. ఈ ఘటనలో భారత నేవీకి చెందిన పర్వతారోహణ బృందం చిక్కుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న 10 మందిలో ఐదుగుర్ని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయి. గల్లంతయిన మిగతా ఐదుగురికి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెయినీరింగ్ ప్రిన్సిపల్ కల్నల్ అమిత్ బిషత్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం అక్కడకు బయలుదేరింది. రెస్యూ బృందం జోషీ‌మఠ్ వద్దకు చేరుకుందని, కానీ వాతావరణం అనుకూలించడం లేదని తెలిపింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎస్డీఆర్‌ఎఫ్ సంయుక్తంగా హెలికాప్టర్ల సాయంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. త్రిశూల్ పర్వతం అంటే త్రిశూలం.. ఇది శివుడికి సంబంధించిన ఆయుధం.. బగేశ్వర్ జిల్లాలో ఉన్న మూడు హిమాలయ శిఖరాల్లో ఇది ఒకటి. త్రిశూల్ పర్వత శిఖరం వద్ద సంభవించిన హిమపాతంలో తమ సభ్యులు చిక్కుకున్నట్టు భారత నౌకదళానికి చెందిన సాహస బృందం శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తమకు సమాచారం ఇచ్చి, సహాయం కోరిందని ఎన్ఐఎం తెలిపింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 20 మంది సభ్యులతో కూడిన భారత నేవీ పర్వతారోహణ బృందం 15 రోజుల క్రితం 7, 120 మీటర్ల ఎత్తులో ఉన్న త్రిశూల్ పర్వత యాత్రను చేపట్టింది. సెప్టెంబరు 30న వీరు ముంబయి నుంచి బయలు దేరారు. శుక్రవారం ఉదయం వీరిలో 10 మంది పర్వతారోహన ప్రారంభించిన సమయంలో హిమపాతం సంభవించి, అందులో చిక్కుకున్నారు. వీరిలో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఏడాది ఆరంభంలో సంప్రదాయానికి భిన్నంగా జాతీయ, అంతర్జాతీయ పర్వతారోహణ యాత్రల కోసం నియంత్రణ సంస్థ ఉత్తరాఖండ్‌లోని పశ్చిమ కుమావన్‌లోని 7,120 మీటర్ల శిఖరమైన పర్వత త్రిశూల్‌కి శీతాకాల పర్వతారోహణకు అనుమతి ఇచ్చింది.


By October 02, 2021 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-navy-mountaineers-go-missing-after-avalanche-hits-mount-trishul-at-uttarakhand/articleshow/86698973.cms

No comments