Breaking News

రూ.285 కోట్లు పరిహారం ఇవ్వాల్సిందే.. షాకిచ్చిన చైనా.. పాక్ ఉక్కిరిబిక్కిరి


పాకిస్థాన్‌లో ఈ ఏడాది జులై 14న చైనా ఇంజనీర్లు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుళ్ల‌కు పాల్ప‌డిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో తొమ్మిది చైనా ఇంజినీర్లు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్లలో చనిపోయిన చైనా ఇంజినీర్లు డసు హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాంబు పేలుడు కారణంగా తమ ఇంజినీర్లు చనిపోవడంతో 38 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని చైనా డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌పై విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, హోం, జల వనరుల మంత్రిత్వ శాఖలు, చైనీస్ ఎంబసీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. డసు ప్రాజెక్టులో పని చేసే ఇంజినీర్లు, సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు ఓ లోయలో పడి అందులోని 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మది మంది చైనీస్ ఇంజినీర్లు, ఇద్దరు స్థానికులు, ఇద్దరు ఫ్రాంటియర్ కానిస్టేబులరీ సిబ్బంది ఉన్నారు. దాదాపు 25 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన తర్వాత డసు ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని పాకిస్థాన్ జల వనరుల శాఖ కార్యదర్శి డాక్టర్ షహజేబ్ ఖాన్ బంగష్ తెలిపారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ముందు భారీ డిమాండ్ ఉంచి చైనా.. తమ ఇంజినీర్లు మరణించినందుకు 38 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని కోరింది. డసు ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించడానికి ముందే ఈ పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. డసు ప్రాజెక్టు సహా చైనా డిమాండ్‌పై చర్చించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల స్టీరింగ్ కమిటీ ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. చైనా డిమాండ్ సహేతుకం కాదని పాక్ వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చైనాకు చెందిన చైనా గెఝౌబా గ్రూప్ కార్పొరేషన్ చేపట్టింది. ఈ దుర్ఘటన తర్వాత ప్రాజెక్టు పనులను నిలిపేసిన ఆ సంస్థ.. నష్టపరిహారం ప్యాకేజీ ప్రకటించి, చైనీయులకు మరింత భద్రత కల్పించే వరకు ఈ పనులను పునఃప్రారంభించబోమని తేల్చిచెప్పింది. తాజా, పరిణామాలతో డ్రాగన్ తత్వం పాక్‌కు ఇప్పడిప్పుడే బోధపడుతోంది. అవసరానికి వాడుకుని వదిలేయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. గతేడాది పాకిస్థాన్‌కు నిధుల విషయంలో డ్రాగన్ యూటర్న్ తీసుకుంది. చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులో భాగంగా మౌలిక వసతుల నిర్మాణాల కోసం పాక్‌కు 60 బిలియన్ డాలర్లు అందజేస్తామని తొలుత ప్రకటించింది. కానీ, ఆ హామీని వెనక్కు తీసుకుంది. పాకిస్థాన్‌లోని చైనా ఇంజినీర్లపై ఉగ్రదాడులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది.


By October 17, 2021 at 11:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-demands-38-million-compensation-from-pakistan-for-dead-engineers-at-dasu-dam/articleshow/87078240.cms

No comments