Breaking News

Uri కశ్మీర్‌లో అతిపెద్ద చొరబాటుయత్నం.. రెండు రోజులుగా కొనసాగుతున్న ఆర్మీ ఆపరేషన్


జమ్మూ కశ్మీర్‌లోకి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు రెండు రోజుల నుంచి భారీ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఉత్తర కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నిస్తున్నట్టు సైన్యం శనివారం రాత్రి గుర్తించింది. ఇటీవల సంవత్సరాలలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు చేసి అతిపెద్ద చొరబాటు ప్రయత్నంగా భావిస్తున్నామని సైన్యం సోమవారం వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌లో వరుసగా రెండో రోజు కూడా పెద్ద ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నట్లు తెలిపింది. ఉత్తర కశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌‌లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం నుంచి ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేశారు. యాదృశ్చికంగా ఉరి సెక్టార్‌పై 2016లో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సెప్టెంబరు 18నే చొరబాటుకు ప్రయత్నించడం గమనార్హం. ఉరి సెక్టార్‌లో పాక్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 19 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాతే పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు నిర్వహించింది. ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాల ప్రకారం.. పాకిస్థాన్ నుంచి ఆరుగురు చొరబాటుదారులతో కూడిన బృందం జమ్మూ కశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో జరిగిన కాల్పుల్లో ఓ సైనికుడు గాయపడ్డారు. చొరబాటుదారులను గుర్తించే ఆపరేషన్ కొనసాగుతోందని, క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన పరిస్థితి గురించి ఇంకా స్పష్టత లేదని సైన్యం తెలిపింది. ఇదిలా ఉండగా, సరిహద్దు చొరబాటుయత్నాన్ని అడ్డుకునే ఆపరేషన్‌లో భాగంగా మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయడం ఇదే మొట్టమొదటిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పులు విరమణ ఒప్పందం తర్వాత ఇది రెండో చొరబాటుయత్నమని సైన్యం పేర్కొంది. ఈ ఒప్పందం తర్వాత పాక్ వైపు నుంచి కాల్పులు ఉల్లంఘన, కవ్వింపు చర్యలు లేవని తెలిపింది. ‘ఈ ఏడాది కాల్పుల ఉల్లంఘన ఇప్పటి వరకూ లేదు.. ఏదైనా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే ఎదుర్కొడానికి సిద్దంగా ఉన్నాం.. కానీ, వాస్తవంగా చెప్పాలంటే సరిహద్దుల్లో ఎటువంటి కవ్వింపు చర్యలు లేవు’ అని 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే అన్నారు. ఈ ఏడాది స్వల్పంగా చొరబాటు యత్నాలు జరిగాయని, ఉరి సెక్టార్‌లో చొరబాటుదారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ‘ఉరిలో గత 24 గంటలుగా ఆపరేషన్ కొనసాగుతోంది.. ఇందులో చొరబాటు ప్రయత్నం జరిగిందని మేము భావించాం... మేము చొరబాటుదారుల కోసం గాలిస్తున్నాం.. వారు ఈ వైపు ఉన్నారా లేదా ప్రయత్నించిన తిరిగి వెనక్కు వెళ్లిపోయారా? ఆ విషయం స్పష్టంగా తెలియదు.. క్షేత్రస్థాయిలో ఇంకా ధ్రువీకరించలేదు’ అని జనరల్ పాండే వ్యాఖ్యానించారు.


By September 21, 2021 at 07:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/biggest-infiltration-attempt-in-jammu-and-kashmir-army-operation-underway/articleshow/86386019.cms

No comments