Breaking News

Modi US Tour బైడెన్-మోదీ మధ్య తొలి భేటీ: పలు అంశాలపై చర్చ.. భారత్‌లోని బంధువులపై జో ఆసక్తికర వ్యాఖ్యలు


అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్షుడు జో బైడెన్‌తో శుక్రవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ బైడెన్, మోదీ ఫోన్‌‌లో మాత్రమే సంభాషించుకుని, వర్చువల్‌ సమావేశాల ద్వారా మాత్రమే కలుసుకున్నారు. 2014, 2016లలో వీరు కలుకున్నప్పటికీ అప్పటికి బైడెన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలూ చర్చించారు. పర్యావరణ పరిరక్షణ, ఉగ్రవాద ముప్పు నివారణ, అఫ్గనిస్థాన్‌ పరిణామాలు, కొవిడ్‌పై ఉమ్మడిపోరు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం సహా ఆర్థిక, రక్షణ సంబంధ వ్యవహారాల్లో పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని, స్నేహాన్ని మరిన్ని కొత్త రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించాయి. వైట్‌హౌస్‌కు చేరుకున్న మోదీకి స్వాగతం పలికి జో బైడెన్.. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అత్యంత దృఢంగా, సన్నిహితంగా ఉండడం నిర్ణయాత్మకమని’’ వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ జయంతిని ప్రస్తావిస్తూ...బాపూజీ అహింస, సహనం, శాంతి సందేశాలు ప్రపంచానికి గతంలో కన్నా ప్రస్తుతం చాలా అవసరమని నొక్కిచెప్పారు. జో బైడెన్ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపిన మోదీ..‘2014, 2016లలోనూ మీతో మాట్లాడే అవకాశం లభించింది.. భారత్‌-అమెరికా సంబంధాలపై మీ దార్శినికతను స్పష్టం చేశారు. దీనిని సాకారం చేసేందుకు మీ నేతృత్వంలో కృషిని కొనసాగించడం హర్షణీయమ’ని అన్నారు. వాణిజ్యం, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం రెండు దేశాల స్నేహ సంబంధాల్లో కీలక భూమిక వహించనుందని తెలిపారు. ‘భూమికి ధర్మకర్తలా వ్యవహరించడం గురించి మహాత్మా గాంధీ నిత్యం చెబుతూ ఉండేవారు.. ధర్మకర్తృత్వం అనే భావన ప్రపంచవ్యాప్తంగా నేటి తక్షణావసరం. 21వ శతాబ్దపు మూడో దశకం ప్రారంభ సంవత్సరంలో మీ నాయకత్వంలో నాటే విత్తనాలు భారత్‌-అమెరికా స్నేహ బంధాన్ని మరింతగా వృద్ధిచెందేలా చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సమాజాల రూపాంతరీకరణకూ ఇది నిదర్శనంగా నిలుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘భారత్, యుఎస్‌ల మధ్య సంబంధాలు మరింత పటిష్టంగా ఉంటాయి.. కోవిడ్ -19, వాతావరణ సవాళ్లు, ఇండో-పసిఫిక్‌లో భదత్ర కోసం పనిచేయడానికి మనం ఇంకా ఏమి చేయగలమో అన్వేషించాలి.. ప్రజాస్వామ్య విలువలను పాటించడం, భిన్నత్వానికి ఉమ్మడి నిబద్ధత, అహింస, సహనం పట్ల గౌరవం గతంలో కంటే ఈ రోజు చాలా సందర్భోచితంగా ఉంది’ అని బైడెన్ పేర్కొన్నారు. ఈ భేటీలో భారత్‌లోని బైడెన్ బంధువుల విషయమైన ఆసక్తికర చర్చ జరిగింది. భారత్‌లో ఇంటి పేర్లతో అనుబంధాలు ముడిపెట్టుకోవడంపై బైడెన్‌ చమత్కరించారు. తొలిసారి 1972లో సెనెటర్‌గా ఎన్నికైనప్పుడు ముంబయి నుంచి ఓ వ్యక్తి లేఖ రాస్తూ.. తన ఇంటి పేరు బైడెన్‌ అని పేర్కొన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యక్షుడి హోదాలో ముంబయి వచ్చినప్పుడు మీడియా ఇదే విషయంపై తనను ప్రశ్నించిందని.. ఆ మర్నాడే భారత్‌లో ఐదుగురు బైడెన్లు ఉన్నారని పత్రికలు రాశాయని తెలిపారు. అయితే, వారి గురించి తానెపుడూ ఆరా తీయలేదన్న బైడెన్... బహుశా నేటి సమావేశం అందుకు ఏమైనా ఉపయోగపడుతుందేమోనంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి తాను కొన్ని పత్రాలను తీసుకొచ్చినట్లు తెలిపిన మోదీ... ‘వారు మీ బంధువులే’ అని చెప్పడంతో సమావేశ మందిరంలో నవ్వులు విరిశాయి.


By September 25, 2021 at 07:13AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/in-bilateral-pm-modi-us-president-joe-biden-discuss-covid-climate-change/articleshow/86499273.cms

No comments