Breaking News

Kashmir గిలానీ అంత్యక్రియలపై వివాదం.. సంచలన వీడియోలు విడుదలచేసిన పోలీసులు


కశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ అంత్యక్రియలకు సంబంధించిన వీడియోలను పోలీసులు విడుదల చేశారు. గత గురువారం గిలానీ అంత్యక్రియలను నిర్వహించిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండానే పోలీసులు బలవంతంగా మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారని గిలానీ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీడియోలను విడుదల చేసిన పోలీసులు.. తాము ఎటువంటి బలవంతం చేయలేదని తెలిపారు. ఒక వీడియోలో వ్యక్తుల సమూహం గిలానీ శరీరాన్ని శుభ్రపరిచి దానిని కప్పి ఉంచడాన్ని కనబడుతోంది. అలాగే, ప్రార్థనల అనంతరం మృతదేహాన్ని గిలానీ నివాసానికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న హైదర్‌పోరా స్మశానవాటికకు తరలించారు. రాత్రివేళ అంత్యక్రియలు జరిపించడానికి తొలుత గిలానీ కుటుంబసభ్యులు అంగీకరించి తర్వాత మనసు మార్చుకోవడంతో తాము ముందుకెళ్లాల్సి వచ్చిందన్నారు. ‘ఏదేమైనా మాతో మాట్లాడిన మూడు గంటల తర్వాత బహుశా పాకిస్థాన్, అక్కడి దుర్మార్గుల ఒత్తిడితో వారు భిన్నంగా ప్రవర్తించారు.. ఆయన పార్దీవదేహానికి పాక్ జెండా చుట్టడం.. పాకిస్థాన్‌కు అనుకూలంగా పెద్దగా నినాదాలు చేయడం.. చుట్టుపక్కల వారిని బయటకు వచ్చేలా ప్రేరేపించడం వంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభించారు’ అని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ చర్యలపై ఉపా చట్టం కింద పోలీసులు ఆదివారం కేసు నమోదుచేసినట్టు తెలిపారు. ‘గిలానీ కుటుంబాన్ని ఒప్పించిన తరువాత బంధువులు మృతదేహాన్ని స్మశానానికి తీసుకువచ్చారు.. ఇంతిజామియా కమిటీ గౌరవ సభ్యులు, స్థానిక ఇమామ్‌తో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కుమారులిద్దరూ స్మశానానికి రావడానికి నిరాకరించడాన్ని బట్టి వారి తండ్రి పట్ల ప్రేమ, గౌరవం కంటే పాక్ అజెండా పట్ల వారి విధేయతను సూచిస్తుంది’ అని అన్నారు. పోలీసులు తలుపులు బద్దలుగొట్టి, తమ పట్ల దురుసగా ప్రవర్తించి బలవంతంగా గిలానీ పార్దీవదేహాన్ని తీసుకెళ్లారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అంత్యక్రియలకు సంబంధించిన వీడియోలను వారు విడుదల చేశారు.


By September 07, 2021 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jammu-and-kashmir-police-post-video-of-separatist-syed-geelani-last-rites/articleshow/85999375.cms

No comments