Breaking News

‘దేవుడు ఉన్నాడు..’.. సైదాబాద్ కేసు నిందితుడి ఆత్మహత్యపై మంచు మనోజ్ రియాక్షన్


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు పల్లకొండ రాజు గురించి.. పోలీసులు మమ్మరంగా గాలిస్తున్నారనే విషయం తెలిసిందే. దాదాపు వెయ్యి మందిపైగా పోలీసులు అతన్ని పట్టుకొనే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాక డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా ఈ కేసును పరిశీలించారు. నిందితుడి ఆచూకీ చెప్పిన వాళ్లకు రూ.10 లక్షల నజరానా కూడా ప్రకటించారు. అయితే గురువారం ఈ కేసులో అనుకోని సంఘటన జరిగింది. పోలీసుల గాలింపులకు దొరకని రాజు స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై శవంగా కనిపించాడు. మృతదేహం చేతిపై ఉన్న ‘మౌనిక’ అనే పచ్చబొట్టు ఆధారంగా అతను రాజు అని పోలీసులు నిర్ధారించారు. అయితే రాజు ఆత్మహత్య చేసుకోవడంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ సైదాబాద్ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తీవ్రంగా విలపిస్తున్న బాలిక తల్లిదండ్రులకు ఆయన ఓదార్చారు. ఆనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బాలిక తల్లిదండ్రులు తన కాళ్ల మీద పడి ఏడుస్తుంటే.. తాను ఏమీ చేయలేని ఓ అసమర్థుడిలా భావన కలిగింది అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటన జరిగింది అంటే.. దానికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని అన్నారు. ఇప్పటికైనా ఆడవాళ్లను ఎలా గౌరవించాలో.. వారితో ఎలా ఉండాలో నేర్పించాలని తెలిపారు. నిందితుడిని పట్టుకొనేందుకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని.. ఆ రాక్షసుడు దొరికితే.. 24 గంటలు మించకుండానే అతన్ని ఉరి తీయాలి అంటూ మనోజ్ డిమాండ్ చేశారు. మీడియా కూడా ఇలాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చేయాలి అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే తాజాగా రాజు మరణించినట్లు మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను మంచు మనోజ్ రీట్వీట్ చేశారు. ‘ఈ వార్త తెలినందుకు ధన్యవాదాలు సార్.. దేవుడు ఉన్నాడు’ అంటూ మనోజ్ పేర్కొన్నారు. కాగా, గురువారం బాలిక తల్లిదండ్రులకు మంత్రులు సత్యవతి రాథోడ్, మహ్మూద్ అలీ పరామర్శించారు. వారికి ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల చెక్ అందించగా.. అనంతరం బాలిక తల్లిదండ్రులు దాన్ని తిరస్కరించారు.


By September 16, 2021 at 01:19PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/manchu-manoj-reaction-on-the-sucide-of-saidabad-culprit/articleshow/86255751.cms

No comments