Breaking News

అధికార పార్టీతో అంటకాగిన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు.. జస్టిస్ ఎన్వీ రమణ ఘాటు వ్యాఖ్యలు


రాజకీయ పార్టీలతో అంట కాగి, అక్రమాస్తులు కూడబెట్టుకునే అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా మెలిగిన పోలీస్ అధికారులు.. ప్రభుత్వం మారినప్పుడు తప్పనిసరిగా తిరిగి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. అధికారంలో ఉన్న నేతలు, పోలీసులు కుమ్మక్కవడమనే కొత్త సంస్కృతి దేశంలో మొదలయ్యిందని వ్యాఖ్యానించింది. అధికారంలో ఉన్న పార్టీలతో సన్నిహితంగా మెలిగి, అక్రమాస్తులు కూడబెట్టుకున్న పోలీసు అధికారులను ఎందుకు రక్షించాలని, వారు జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొంది. ఆదాయానికి మించి ఆస్తులను కలిగున్నారనే ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి గుర్జీందర్‌ పాల్‌ సింగ్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆయనపై రాజద్రోహం అభియోగాన్ని కూడా మోపింది. ఈ కేసుల్లో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం చత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ గుర్జీందర్ పాల్ సింగ్‌కు చుక్కెదురయ్యింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు గడపతొక్కారు. తనను రక్షించాలని కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తిపై జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆయనను ప్రస్తుతం అరెస్టు చేయకూడదంటూ తాత్కాలిక ఉత్తర్వులు జారీచేసినప్పటికీ ఇలాంటి అధికారుల ప్రవర్తనపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మాట్లాడుతూ .. ‘ప్రతి కేసులోనూ మీరు రక్షణ పొందలేరు.. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మీరు డబ్బులు గుంజుకోగలిగారు.. అయితే ఏదో ఒక రోజున దీన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.. ఇది మరీ దారుణం.. ఇలాంటి అధికారులను ఎందుకు రక్షించాలి? దేశంలో ఇదో కొత్త ధోరణి ప్రబలుతోంది’ అని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ కల్పించుకొని అలాంటి అధికారులను రక్షించాల్సి ఉందని చెప్పారు. దీనిపై జస్టిస్‌ రమణ స్పందిస్తూ ‘లేదు..అలాంటి వారు జైలుకు వెళ్లాల్సి ఉంది’ అని అన్నారు. నిజాయితీపరులైన అధికారులు వేధింపులకు గురవుతున్నారని, అలాంటి వారిని రక్షించాల్సి ఉందని వికాస్ సింగ్ చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ధర్మాసనం.. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. మరో కేసులో ఇదే అధికారిని అరెస్టు చేయకుండా ఆగస్టు 26న కూడా సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ప్రభుత్వాలు మారినప్పుడు పోలీసు అధికారులపై రాజద్రోహం, ఇతర కేసులు నమోదు చేయడం కొత్త విధానంగా మారిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు వారి పక్షం వహిస్తే, ఆ తర్వాత మరో కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారిపై కొత్త ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి’ అని ఆ సందర్భంగా జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు.


By September 28, 2021 at 09:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/politicians-and-police-nexus-new-trend-in-country-why-it-should-protect-such-officers-says-sc/articleshow/86575206.cms

No comments