Breaking News

అసోం పడవ ప్రమాదం: 70 మంది ఆచూకీ గల్లంతు.. ప్రాణాలతో బయటపడ్డ 50 మంది


అసోంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. బ్రహ్మాపుత్ర నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు చనిపోగా.. మరో 70 మంది గల్లంతయ్యారు. జోర్హాత్‌ జిల్లా నీమాటిఘాట్‌లో బుధవారం మధ్యాహ్నం తర్వాత ఈ ఘటన సంభవించింది. మజులి నుంచి నీమాటిఘాట్‌కు వెళ్తున్న ఓ పడవ.. తిరుగు ప్రయాణంలో స్టీమర్ రెండూ ఢీకొన్నాయి. ఈ రెండు పడవల్లో కలిపి 120 మందికిపైగా ప్రయాణిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పడవ బోల్తా పడటంతో అందులోని కొందరు నదిలో దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలను దక్కించుకున్నారు. ఈత రాని వారు మునిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలిస్తుండగా.. ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 50 మందిని రక్షించామని, మరో 70 మంది ఆచూకీ గల్లంతయ్యిందని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండ్ శ్రీవాత్సవ్ తెలిపారు. ఈ ఘటనపై అసోం మాజీ సీఎం, కేంద్ర షిప్పింగ్‌, ఓడరేవుల శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ ఘటన జరిగిన ప్రాంతాన్ని గురువారం సందర్శించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని మోదీ, అమిత్ షాలు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అసోంలో బ్రహ్మపుత్ర నదిలో ఇటువంటి ప్రమాదాలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో బ్రహ్మపుత్రలో పడవ మునిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 2018 డిసెంబరులో జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం సంభవించింది. అసోం మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు బ్రహ్మపుత్రను దాటేందుకు పడవలే దిక్కు. ఒక్కోసారి ఈ ప్రయాణాలు వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయి.


By September 09, 2021 at 07:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/one-dead-70-missing-in-two-boats-collide-in-brahmaputra-river-in-assam/articleshow/86054832.cms

No comments