Breaking News

50 ఏళ్లు పైబడినా ఆటో నడుపుతున్న మహిళ.. ఈవిడ చాలా గ్రేట్, ఇంట్రెస్టింగ్ స్టోరీ


ఆటో డ్రైవర్ అనగానే మనకు పురుషులే గుర్తుకొస్తారు. డ్రైవింగ్ ఫీల్డ్ కష్టంతో కూడుకున్నది కావడంతో.. మహిళలు ఈ రంగంవైపు పెద్దగా ఆసక్తి చూపరు. డ్రైవింగ్ ఫీల్డులోకి వచ్చిన మహిళల్లోనూ ఎక్కువ మంది కొన్నేళ్లు మాత్రమే ఈ రంగంలో ఉంటారు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు చూస్తున్న మహిళ మాత్రం 50 ఏళ్లు దాటినా.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఖాకీ చొక్కా ధరించి.. ఆటో తుడుస్తూ.. ప్యాసింజర్ల కోసం ఎదురు చూస్తున్న ఈ పెద్దావిడ పేరు నిర్మల. రాయచూర్ బస్ స్టేషన్ ముందు ఆమె ఆటోను ఉంచుతారు. అమరేశ్వర్ కాలనీకి చెందిన ఆమె.. గత 28 ఏళ్లుగా ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. నిర్మలది చాలా పేద కుటుంబం. పెళ్లయి.. పిల్లలు పుట్టాక.. భర్త తాగుడుకు బానిసై పని మానేయడంతో.. కుటుంబ పోషణ భారం మొత్తం ఆమెపైనే పడింది. పిల్లల చదువులకయ్యే ఖర్చులు కూడా ఆమే భరించాల్సి వచ్చింది. ఇటీవల తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రత్న ప్రభ గుర్తున్నారు కదా. 1992లో ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. మహిళ సాధికారత కోసం ప్రయత్నించిన ఆమె.. మహిళలు ఆటో నడపడటంలో ఆమె శిక్షణ ఇప్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నిర్మల ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నారు. డ్రైవింగ్ నేర్చుకున్న 11 మందికి ప్రభుత్వం సబ్సిడీ మీద ఆటోలు అందించింది. వారిలో నిర్మల కూడా ఒకరు. మిగతా మహిళలు కొంత కాలానికే ఆటో నడపడం మానేసినా.. నిర్మల మాత్రం గత 26 ఏళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆటో నడపొద్దని భర్త వారించినా ఆమె వినలేదు. ఆటో డ్రైవర్‌గా పని చేసే క్రమంలో నిర్మల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ప్రయాణికులు అసభ్యంగా తాకేవారు. కానీ మానసికంగా బలంగా ఉన్న ఆమె వాటన్నింటిని అధిగమించారు. మగాళ్లతో సమాన స్థాయిని ఆమె పొందారు. ఆటో నడుపుతూ వచ్చిన సంపాదనతోనే ఆమె రాయచూర్‌లో ఓ స్థలాన్ని సైతం కొనుగోలు చేశారు.


By September 29, 2021 at 07:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-woman-rides-auto-for-her-family/articleshow/86599806.cms

No comments