Breaking News

అక్టోబరులో గరిష్ఠానికి థర్డ్ వేవ్.. పిల్లలపై తీవ్ర ప్రభావం: ప్రధానికి ఎన్ఐఎండీ సంచలన నివేదిక


దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి అక్టోబరు నాటికి గరిష్ఠానికి చేరుతుందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐఎండీ) నిపుణుల కమిటీ నివేదిక హెచ్చరించింది. థర్డ్ వేవ్‌లో పిల్లలు ఎక్కువ ప్రభావితమవుతారని, పెద్దలకు కూడా ముప్పు ఉంటుందని తెలిపింది. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొడానికి వైద్య సౌకర్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి నివేదికను అందజేసింది. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలతో ఎన్ఐఎండీ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి, నివేదికను రూపొందించింది. ‘ఒకవేళ పెద్ద సంఖ్యలో పిల్లలు కోవిడ్ బారినపడితే వారికి తక్షణమే చికిత్స అందజేసేలా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్‌లు సహా పిల్లలకు అవసరమైన సౌకర్యాలను సిద్ధం చేసుకోవాలి’ అని తెలిపింది. వ్యాక్సినేషన్‌లో అనారోగ్య సమస్యలున్న చిన్నారులకు ప్రాధాన్యత, దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. అక్టోబరులో తారాస్థాయికి చేరుకుంటుందని గతంలో వివిధ సంస్థలు వేసిన అంచనాలతో ఈ కమిటీ ఏకీభవించింది. పిల్లలు వ్యాక్సినేషన్ ప్రారంభం కాకపోవడంతో వారికి ముప్పు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే, చిన్నారులపై కోవిడ్ తీవ్రత తక్కువగా ఉంటుందని చాలా మంది నిపుణుల పేర్కొంటున్నా.. వారి ద్వారా ఇతరులకు మహమ్మారి వ్యాపిస్తుందని ఆందోళన చెందుతున్నారు. రెండో దశతో పోల్చితే థర్డ్ వేవ్ తీవ్రత తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ‘థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనే సంసిద్ధత.. పిల్లలపై ప్రభావం, రికవరీ’ పేరుతో నివేదికను రూపొందించిన ఎన్ఐఎండీ నిపుణులు.. మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను పరిశీలించింది. సంపూర్ణ గృహ సంరక్షణ నమూనా, పిల్లల వైద్య సామర్థ్యాలలో తక్షణ పెరుగుదల, పిల్లల మానసిక ఆరోగ్య సమస్యలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చిన్న పిల్లల నిపుణుల కొరత 82 శాతం ఉందని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లో వ్యాక్సిన్ల కొరత 63 శాతం ఉందని ఎత్తిచూపింది. ‘పరిస్థితి ఇప్పటికే భయంకరంగా ఉంది.. కోవిడ్-19కు తగినట్టు చర్యలు తీసుకోకపోవడం, తగినంత వైద్య సదుపాయాలు లేకపోవడం.. వ్యాక్సినేషన్‌లో జాప్యం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు’ అని హెచ్చరించింది. ‘గత రెండు దశలలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకుని సంసిద్ధంగా ఉండటం కీలకం... థర్డ్ వేవ్‌ను ఊహించి మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి.. పిల్లల వైద్య నిపుణుల సహా చికిత్స, ఐసీయూ, పీడియాట్రిక్ అంబులెన్స్, ఔషధాల కోసం పీడియాట్రిక్ కోవిడ్ సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడం రాష్ట్రాలు ప్రారంభించాలి’ అని నిపుణుల కమిటీ కో-ఆర్డినేటర్, ఎన్ఐడీఎం గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ విభాగం చీఫ్ డాక్టర్ సంతోష్ కుమార్ అన్నారు. పెరుగుతున్న ‘ఆర్’-విలువ కోవిడ్ -19 పునరుత్పత్తి రేటు జూలై చివరి వారంలో 0.9 నుంచి 1 కి పెరగడం థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైపోయిందనడానికి సంకేతమని అన్నారు. కేరళలో ప్రస్తుతం రోజువారీ కేసులు భారీగా నమోదు కావడం.. అక్కడ ఆర్ వాల్యూ 1.1గా ఉండటం బట్టి థర్డ్ వేవ్ ప్రారంభమైందని, దీనిని ఉపేక్షించరాదని హెచ్చరించారు.


By August 23, 2021 at 11:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-third-wave-looms-may-peak-in-october-hit-kids-nimd-report/articleshow/85554606.cms

No comments