Breaking News

కాబూల్ పేలుళ్లకు ప్రతీకారం.. అఫ్గన్‌లోని ఐఎస్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు


కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన 24 గంటల్లోనే ఐఎస్ ఉగ్రస్థావరాలపై అమెరికా విరుచుకుపడింది. కాబూల్ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకున్న ఇస్లామిక్ స్టేట్- ఖోర్సాన్ స్థావరాలపై వైమానిక దాడులు చేసినట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. అఫ్గనిస్థాన్‌ నంగర్‌హర్ ప్రావిన్సుల్లో ఐఎస్-కే స్థావరాలే లక్ష్యంగా జరిగిన వైమానిక దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ వెల్లడించారు. ‘ఈ దాడుల్లో పౌరులకు ఎటువంటి గాయాలు కాలేదు’ అని ఆయన తెలిపారు. అఫ్గన్ బయట నుంచే వైమానిక దాడులను నిర్వహించారు. వద్ద పేలుళ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు దాడులు జరిగినా భయపడకుండా ప్రజలు మాత్రం విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. అబే గేటు వద్ద గురువారం సాయంత్రం జరిగిన బాంబు పేలుళ్లలో 13 మంది అమెరికా సైనికులు, తాలిబన్లు, అఫ్గన్ పౌరులు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 160 మంది వరకూ గాయపడ్డారు. అయితే, చనిపోయినవారి సంఖ్య 200పైనే ఉంటుందని పలు మీడియా నివేదికలు వెల్లడించాయి. ఉగ్రదాడి అనంతరం కాబుల్ విమానాశ్రయంలో శుక్రవారం తిరిగి అత్యవసర తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్‌ వంటి పలు దేశాలు ఈ రోజుతో తరలింపును ముగించాలనే నిర్ణయానికి వచ్చాయి. తమ దేశీయులు, ఇప్పటికే ఆశ్రయం కోసం అనుమతి పొందిన వారికి మినహా కొత్తవారికి అవకాశం ఇవ్వడం లేదని తెలిపాయి. కాబూల్ విమానాశ్రయంలో దాడులకు పాల్పడినవారు ఇంతకు ఇంతా మూల్యం చెల్లించుకుంటారని జో బైడెన్ హెచ్చరించారు. ‘మేము ఎవ్వర్నీ క్షమించం.. ఏదీ మరిచిపోం.. మేము వేటాడి పట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం’ అని బైడెన్ శపథం చేశారు. ఒకవైపు బాంబు దాడుల భయం వారిని వేధిస్తున్నప్పటికీ.. దేశం దాటాలనే ఆత్రమే ప్రతిఒక్కరిలో కనిపిస్తోంది. కొందరు విమానాశ్రయం లోపలికి ప్రవేశించేందుకు మురికి కాలువలో నిల్చుండిపోయారు. తమ వంతువచ్చే వరకు అక్కడ గోడల వద్ద వేచిచూస్తున్న దృశ్యాలను అక్కడి మీడియా సంస్థ ఒకటి వెలుగులోకి తెచ్చింది.


By August 28, 2021 at 08:33AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-drone-strikes-islamic-state-terror-camps-kills-member-of-group-blamed-in-kabul-bombing/articleshow/85706472.cms

No comments