Breaking News

Kargil War దాయాది నమ్మకద్రోహానికి గుణపాఠం.. కార్గిల్‌లో భారత్ విజయానికి 22 ఏళ్లు


ఉగ్రవాదం ముసుగులో కశ్మీర్‌ను కబళించేందుకు పాక్ చేసిన కుటిల ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. ఉగ్రమూకలతో చేతుల కలిపిన పాక్.. ‘భారత్‌తో పోరాడుతోంది మేం కాదు.. కశ్మీర్ స్వాతంత్రం ఆకాంక్షించే వాళ్లే’ అని ప్రపంచాన్ని నమ్మించాలని చూసింది. కానీ కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విసిరన పంజాకు దాయాది చావు దెబ్బతింది. ఉగ్రవాదులతో కలిసి కార్గిల్ సెక్టార్‌ను ఆక్రమించిన పాకిస్థాన్ సైన్యాన్ని తరిమి తరిమికొట్టింది. ... దీని ప్రస్తావన వస్తే 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకించిపోతాయి. దాయాది పాకిస్థాన్‌పై మన సాధించిన విజయం సామాన్యమైనది కాదు. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్‌కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించి నేటికి 22ఏళ్లు పూర్తయ్యింది. హిమాలయ పర్వతాల్లోని ఘర్‌కోం అనే గ్రామంలో తషీ నామ్‌గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్-పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు. అక్కడ చాలామంది సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి కంచెను దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధారించుకున్న తషీ వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకోగా పాక్‌ సైన్యం వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి పడిన తొలి అడుగు ఈ ఘటన. దాయాది నమ్మకద్రోహం భారత్-పాక్ నియంత్రణ రేఖ వెంబడి హియాలయ పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాలను శీతాకాలానికి ముందు రెండు దేశాలు ఖాళీ చేస్తుంటాయి. భూభాగానికి 14-18వేల అడుగుల ఎత్తులో ఉండే ఆ ప్రదేశంలో ఉండే అత్యంత శీతల వాతావరణం మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉండదు. దీంతో ఆ కాలంలో సైనిక శిబిరాలు ఖాళీ చేయాలన్నది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. అయితే 1999లో ఈ పరిస్థితిని పాక్ సొమ్ము చేసుకుని భారత్‌ను దెబ్బతీయాలని పన్నాగం పన్నింది. ఆ ఏడాది కూడా శీతాకాలానికి ముందు ముష్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్ , తుర్‌తుక్ సబ్ సెక్టార్ల నుంచి భారత బలగాలు వైదొలగడంతో పాక్ కుయుక్తులు పన్నింది. దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. 1999 ఫిబ్రవరిలో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌లు రెండు దేశాల మధ్య శాంతి కోసం ‘లాహోర్‌ ప్రకటన’ చేసిన సమయంలోనే ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్‌ ఈ కుట్రకు తెరదీశారు. ‘ఆపరేషన్ విజయ్’ ఎన్ని హెచ్చరికలు చేసినా భారత సైనిక శిభిరాల నుంచి పాక్ సైన్యం పట్టించుకోకపోవడంతో భారత్ సైనిక చర్య చేపట్టింది. ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో 1999, మే 3న రంగంలోకి దిగిన భారత సైన్యం శత్రువుల కాల్పులను ఎదుర్కొంటూనే అత్యంత ఎత్తుగా ఉన్న పర్వత శ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు కూడా శిబిరాల్లో ఉన్నారని నిర్ధారించుకున్న భారత్.. ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ పేరుతో ఎయిర్‌ఫోర్స్‌ను రంగంలోకి దించింది. అయితే 32వేల అడుగుల ఎత్తులో పోరాటం చేయాల్సి రావడంతో ఎయిర్‌ఫోర్స్‌‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. శత్రువుల దాడిలో రెండ్రోజుల్లోనే మూడు యుద్ధ విమానాలు నేలకూలాయి. దీంతో దెబ్బతిన్న బెబ్బులిలా లేచిన వాయుసేన మిరాజ్-2000 యుద్ధవిమానాల ద్వారా శత్రవులపై బాంబుల వర్షం కురిపించింది. భారత సైన్యం వరుస దాడులతో పాక్ సైన్యం కకావికలమైంది. దీంతో సైనిక శిబిరాలు ఒక్కొక్కటిగా భారత వశమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా దేశాలన్నీ పాక్‌కు వ్యతిరేకంగా మారేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో దారికొచ్చిన పాక్ శిబిరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. మన సైనికుల వీర పోరాటంతో హిమాలయ పర్వత సానుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ యుద్ధం అధికారికంగా 1999 జులై 26న ముగిసింది. ఈ పోరులో 559 మంది భారత సైనికులు వీర మరణం పొందగా, 1536 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 3వేల మంది సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. . 22వ ‘విజయ్ దివస్’ వేళ మనమూ వీర సైనికుల త్యాగాలను స్మరించుకుందాం.


By July 26, 2021 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kargil-vijay-diwas-indias-great-victory-over-pakistan/articleshow/84747787.cms

No comments