Breaking News

అసోం, మిజోరాంల మధ్య ఘర్షణ.. ఆరుగురు పోలీసులు మృతి


ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు వివాదం సోమవారం తీవ్ర ఘర్షణకు దారితీసింది. అసోం, మిజోరాం సరిహద్దులోని కచార్‌ జిల్లాలో చిన్నగా మొదలైన ఘర్షణలు చినికిచినికి గాలివానలా మారి ఏకంగా ఆరుగురు పోలీసులను బలిగొన్నాయి. ఆరు గంటలకుపైగా జరిగిన ఈ ఘర్షణ యుద్ధాన్ని తలపించింది. ఈ ఘటనలో ఓ ఎస్పీ సహా 80 మందికి పైగా గాయపడ్డారు. ఇరువైపులా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. గతేడాది ఆగస్టు, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సరిహద్దు సమస్యపై ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పునరావృతమయ్యాయి. సరిహద్దులోని వ్యవసాయ పాకలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడమే తాజా ఘర్షణలకు కారణంగా కనిపిస్తోంది. సరిహద్దు సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చర్చలు జరిపి వెళ్లిన మర్నాడే ఈ ఘర్షణలు చోటుచేసుకోవడం గమనార్హం. కచార్‌ జిల్లాలో మేఘాలయ వైపు నుంచి అల్లరిమూకలు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసులు ఆరుగురు మృతి చెందారని హిమంత బిశ్వశర్మ తెలిపారు. సరిహద్దుల్లో చోటుచేసుకున్న కాల్పులు, రాళ్లు రువ్విన ఘటనల్లో కచార్‌ జిల్లా ఎస్పీ నింబాల్కర్‌ వైభవ్‌ చంద్రకాంత్‌ సహా 50 మంది సిబ్బంది గాయపడినట్లు అసోం పోలీసు విభాగానికి చెందిన అధికారి ఒకరు చెప్పారు. ఇరు రాష్ట్రాల అధికారులు సరిహద్దు వివాదంపై చర్చలు జరుపుతుండగా అల్లరిమూకలు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించాయని పేర్కొన్నారు. కచార్‌ ఎస్పీ నింబాల్కర్‌ తొడ భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. లైలాపూర్‌లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని ధ్వంసం చేసి మిజోరాం.. రహదారిని నిర్మించి, అక్కడికక్కడే సాయుధ శిబిరాన్ని ఏర్పాటు చేసిందని అసోం ఆరోపించింది. మరోవైపు, ఈ ఉద్రిక్తతలకు అసోం పోలీసులే కారణమని మిజోరం ఆరోపించింది. సరిహద్దులో ఆక్రమణలపై అసోం, మిజోరంల మధ్య చాలా కాలం నుంచి ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయిత్లాంగ్‌ సెలయేరు సమీపంలో రైతులకు చెందిన వ్యవసాయ పాకలకు ఆదివారం ఉదయం దుండగులు నిప్పుబెట్టారని మిజోరాం డీఐజీ లాల్బియాకాంగ ఖియాంగ్టే చెప్పారు. ఈ పాకలన్నీ సరిహద్దులో అసోం వైపున్న వైరెంగ్టేకి చెందిన రైతులవని వెల్లడించారు. తాజా ఘర్షణలపై ఇరు రాష్ట్రాల సీఎం ట్విట్టర్‌లో వీడియోలను పోస్ట్ చేసి పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నారు. కచార్‌ సరిహద్దులో పోలీసులతో ప్రజలు ఘర్షణ పడుతున్న వీడియోను పోస్ట్ చేసిన మిజోరం సీఎం జొరాంథాంగా.. దీనిపై దృష్టి సారించాలని అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ‘మిజోరం-అస్సాం సరిహద్దు ఉద్రిక్తత’గా పేర్కొన్న ఈ ట్వీట్‌కు ప్రధాని, హోంమంత్రి కార్యాలయాలు, అసోం సీఎం, కచార్‌ జిల్లా కలెక్టర్‌, కచార్‌ పోలీసులను ట్యాగ్‌ చేసి తక్షణం దీనిని ఆపాలని కోరారు. కచార్‌ మీదుగా కారులో మిజోరాం వస్తున్న దంపతులపై గూండాలు, దొంగలు దాడి చేశారని ఆరోపిస్తూ.. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పెట్టారు. దీనిపై స్పందించిన అసోం హిమంత బిశ్వశర్మ.. లైలాపుర్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘర్షణలు, కాల్పులపై మిజోరాం ముఖ్యమంత్రి జొరాంథాంగా జోక్యం చేసుకోవాలని కోరారు. అల్లరి మూకలకు మిజోరాం పోలీసులు మద్దతు పలికి అసోం పోలీసులపై టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు. ఈ సమయంలో అల్లరి మూకలను నియంత్రించాలని మిజోరాం పోలీసులను కోరితే.. మేమేం చేయలేమని చేతులెత్తేశారని అన్నారు. ‘ఎస్పీ కోలాసిబ్.. అస్సాం అధికారులతో చర్చలు జరుపుతున్నప్పటికీ.. మిజోరాం పోలీసులు హఠాత్తుగా ఆయుధాలు, లైట్ మెషీన్ గన్స్‌తో కాల్పులు జరిపారు’ అని అసోం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. తాజా ఘర్షణలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. వివాదానికి పరస్పర అంగీకారంతో శాంతియుత పరిష్కారం లభించేలా చూడాలని కోరారు.


By July 27, 2021 at 06:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/six-cops-killed-due-to-battle-between-assam-mizoram-police-forces-in-border/articleshow/84779586.cms

No comments