Breaking News

APJ Kalam పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్‌గా.. మిస్సైల్ మ్యాన్ జీవితం యువతకు ఆదర్శం


శాస్త్రవేత్తగా, ప్రజా రాష్ట్రపతిగా, విద్యార్థులకు మార్గనిర్దేశకునిగా, రచయితగా అసమాన ప్రతిభా పాటవాలు చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఆవుల్ ఫకీర్ జైనలుబ్దీన్ అబ్దుల్ కలాం. మనందరికీ ఏపీజే అబ్దుల్ కలాంగా సుపరిచితులు. ‘మిస్సైల్ మ్యాన్’గా భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అసామాన్య ప్రజ్ఞాశాలి. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు.. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానం యువతరానికి స్ఫూర్తిదాయకం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన స్వభావం ఎందరికో మార్గనిర్దేశం. ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అని కలాం చెప్పిన మంచి మాట యువతలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. ఒక శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించిన కలాం.. తర్వాత అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు. అగ్ని, పృథ్వీ వంటి ఎన్నో మిస్సైల్స్ ఆయన ఆధ్వర్యంలోనే నింగిలోకి దూసుకెళ్లాయి. బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధికి ఏర్పాటైన ప్రాజెక్ట్ డెవిల్ అండ్ ప్రాజెక్ట్ వాలియెంట్ (VALIAN)కు కలాం డైరెక్టర్‌గా పనిచేశారు. జులై 1992 నుంచి డిసెంబర్ 1999 వరకు ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ముఖ్యకార్యదర్శిగానూ సేవలందించారు. పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించారు. భారత 11వ రాష్ట్రపతిగా పనిచేసిన కలాం.. ‘పీపుల్స్ ప్రెసిడెంట్’గా ఖ్యాతి గడించారు. నిరాడంబర జీవితం గడిపి రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చారు.రాజకీయాల నేపథ్యంలో రెండోసారి రాష్ట్రపతి పదవి చేపట్టడానికి ఆసక్తి చూపని కలాం.. పదవీకాలం ముగిసిన అనంతరం విద్యార్థి లోకానికి అత్యంత చేరువయ్యారు. దేశ, విదేశాల్లో ఎన్నో యూనివర్సిటీల్లో తన ఉపన్యాసాలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. 2015 జులై 27 మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఐఐఎం విద్యార్థులకు పాఠం చెబుతూ కుప్పకూలిపోయారు. ఎవరికీ అందనంత దూరానికి వెళ్లిపోయారు. ఈ నిరంతర కృషీవలుణ్ని దేశ అత్యుత్తమ పురస్కారం ‘భారతరత్న’ సహా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఐక్యరాజ్య సమితి సైతం కలాం జన్మదినోత్సవాన్ని అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించి ఆయన్ని గౌరవించింది. అలాంటి మహోన్నత వ్యక్తి జన్మించిన ఈ గడ్డపై పుట్టడం మనందరికి గర్వకారణం. తిరిగిరాని లోకాలకు వెళ్లినా ఈ మహోన్నత వ్యక్తి సేవల్ని భారత జాతి ఎన్నటికీ మరిచిపోలేదు. నేడు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చెప్పిన మంచి మాటలను స్మరించుకుందాం. జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడే.. విజయాలను ఆస్వాదించగలం. - అబ్దుల్ కలాం ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం.. కానీ, ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంలో సమానం. - అబ్దుల్ కలాం ఎవరినైనా తెలిగ్గా ఓడించవచ్చు.. కానీ, వారి మనసును గెలవాలంటే మాత్రం.. ఎంతో శ్రమించాలి. మన జననం సాధారణమైనదే కావచ్చు. కానీ, మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేలా ఉండాలి. - అబ్దుల్ కలాం


By July 27, 2021 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/missile-man-and-pupils-president-dr-apj-abdul-kalam-death-anniversary/articleshow/84781084.cms

No comments