Breaking News

కేంద్ర మంత్రులు, విపక్ష నేతల సహా 300 మంది భారతీయుల ఫోన్లు హ్యాక్?


పలువురు కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌వో గ్రూప్‌నకు చెందిన ‘పెగాసస్‌’ అనే స్పైవేర్‌ సాయంతో ఈ హ్యాకింగ్‌ జరిగినట్టు పేర్కొన్నాయి. వాస్తవానికి ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉండే ఈ స్పైవేర్.. నిఘా కార్యకలాపాల కోసం ప్రభుత్వ సంస్థలకు ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ విక్రయిస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజా హ్యాకింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీంతో తమకెలాంటి సంబంధం లేదని కేంద్రం వెల్లడించింది. దేశ పౌరులందరి గోప్యత హక్కును పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని హ్యాకింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చింది. ఓ మీడియా కథనం ప్రకారం.. ‘పెగాసస్‌’ హ్యాకింగ్ జాబితాలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారందరి ఫోన్‌ నంబర్లు తాజా డేటాబేస్‌లో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, న్యాయ కోవిదులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, హక్కుల కార్యకర్తల వంటి వారి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వీరిని లక్ష్యంగా చేసుకున్నారని, సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జ్ ఫోన్‌ నంబరు కూడా ఈ జాబితాలో ఉందని పేర్కొంది. భారత్‌తో పాటు అజర్‌బైజాన్‌, బహ్రెయిన్‌, హంగేరి, మెక్సికో, మొరాకో, సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయి. దీనికి సంబంధించిన కథనాలను వాషింగ్టన్‌ పోస్ట్‌ సహా 16 అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించాయి. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్ట్‌లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఎల్గార్‌ పరిషద్‌ కేసులో అరెస్టయిన ఉద్యమకారులు, న్యాయవాదులు, విద్యావేత్తలకు చెందిన 9 నంబర్లు ఇందులో ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ మాజీ ప్రొఫెసర్‌ నంబరు కూడా ఉంది. కాగా, హ్యాకింగ్ గురించి బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆదివారం ఉదయం ట్వీట్ చేయడం.. ఇది జరిగిన కొద్ది గంటల తర్వాత విషయం బయటకు రావడంతో చర్చనీయాంశమవుతోంది. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు సహా పలువురి ఫోన్ల ట్యాపింగ్‌కు గురయినట్టు విదేశీ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించేందుకు సిద్ధమయ్యాయని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ సంస్థ ట్యాపింగ్ చేసినట్లు విదేశీ మీడియా వాషింగ్టన్ పోస్ట్,లండన్ గార్డియన్ వార్తలు ప్రచురిస్తాయన్న వదంతులు వస్తున్నాయి.. అదే నిజమైతే ఆ లిస్ట్‌ను తాను విడుదల చేస్తానని ట్వీట్ లో స్వామి తెలిపారు.


By July 19, 2021 at 07:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/phones-of-indian-politicians-journalists-hacked-using-pegasus/articleshow/84539487.cms

No comments