Breaking News

SPB Birth Anniversary.. టాలీవుడ్ ఘన నివాళి.. సింగర్లందరూ అలా


గాన గంధర్వుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేవలం తెలుగులోనే కాకుండా దాదాపు భారతీయ భాషలన్నింట్లోనూ తన గాత్రాన్ని వినిపించాడు. బాలీవుడ్‌లో బాలు గానానికి ఫిదా కానివారెవ్వరూ ఉండరు. ఒకప్పుడు మ్యూజికల్ హిట్ అయి మెలోడీ పాటలు అందరినీ ఊపేశాయంటే అదే బాలు గాత్ర మహిమే. అలా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఎస్పీబీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన గత ఏడాది మరణించడంతో సంగీత పరిశ్రమ మూగబోయినట్టైంది. గత ఏడాది కరోనా కారణంగా సెప్టెంబర్ 25న కన్ను మూశారు. కరోనాతో చివరి వరకు పోరాడి ఓడిపోయారు. అలా ఎస్పీబీ ఎంతో మంది అభిమానులను అనాథలను చేసి వెళ్లిపోయారు. ఆయన గానం మూగబోయినా కూడా పాడిన పాటలు మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారు. 40 వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఆయనది. పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఆయన్ను వరించాయి. ఇక ఎస్పీబీ గాయకుడు, సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ఎన్నో మంచి పాత్రలను పోషించారు. మిథునం సినిమా ఎప్పటికీ గుర్తుండేపోయే చిత్రంగా టాలీవుడ్‌లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే నేడు (జూన్ 4) ఎస్పీబీ 75వ జయంతి. ఈ క్రమంలో టాలీవుడ్ సింగర్స్ అందరూ కూడా నివాళి అర్పించేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లైవ్ కాన్సర్ట్ పెట్టలేము. కాబట్టి అందరూ కూడా ఆన్ లైన్‌లోనే పాటల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కొనసాగుతుందని, ఈ ఈవెంట్‌లో హీరో దర్శక నిర్మాతలు సింగర్లు అందరూ కూడా పాల్గొంటారని, ఎస్పీబీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారని అన్నారు. ఇక గాయనీగాయకులు ఆయన పాటలను ఆలపిస్తూ శ్రోతలను అలరించనున్నారు. ఈ మేరకు టాలీవుడ్ సింగర్లందరూ కలిసి ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.


By June 04, 2021 at 08:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-singers-tribute-to-spb-birth-anniversary/articleshow/83223643.cms

No comments