Breaking News

యెమెన్‌లో Houthi Rebels క్షిపణి దాడి.. ఐదేళ్ల చిన్నారి సహా 17 మంది మృతి


యెమెన్‌లో మరోసారి హౌతీ తిరుగుబాటుదారులు పేట్రేగిపోయారు. ప్రభుత్వ అధీనంలోని ఉన్న గ్యాస్ స్టేషన్‌ లక్ష్యంగా తిరుగుబాటుదారులు క్షిపణి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఐదేళ్ల బాలిక సహా 17 మంది మృతిచెందిన అధికారులు వెల్లడించారు. మారిబ్‌లోని రావ్డా పరిసరాల్లోని గ్యాస్‌స్టేషన్‌ లక్ష్యంగా దాడి జరిగిందని ప్రావిన్సుల గవర్నర్ ప్రెస్ సెక్రటరీ అలీ అల్ గులిసి పేర్కొన్నారు. దాడిలో 17 మంది మృతి చెందారని, మరో ఐదుగురు గాయపడ్డారని సమాచార శాఖ మంత్రి మొయమ్మర్ అల్ ఇర్యానీ తెలిపారు. క్షిపణి దాడుల్లో క్షతగాత్రులంతా పౌరులేనని వివరించారు. బాలిస్టిక్ క్షిపణి దాడి జరిగిన కొద్దిసేపటికే తిరుగుబాటుదారులు పేలుడు పదార్థాలతో ఉన్న డ్రోన్‌ను సైతం పేల్చివేశారని యెమెన్ అధికారిక వార్తా సంస్థ సాబా సంస్థ తెలిపింది. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తుండగా డ్రోన్‌‌లతో అంబులెన్స్‌లపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో రెండు అంబులెన్సులు ధ్వంసమయ్యాయి. అయితే, దాడికి సంబంధించి ఇప్పటి వరకు హౌతీ నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. క్షిపణి దాడి కారణంగా గ్యాస్ స్టేషన్‌లో మంటలు చెలరేగి అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. గ్యాస్ స్టేషన్ పూర్తిగా దగ్ధమయ్యింది. ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగబాటుదారులు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి యెమెన్‌లో ప్రభుత్వ ఆస్తులు, అధికారులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. యెమెన్ ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య సయోధ్యకు ఐక్యరాజ్యసమితి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రూపొందించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. యెమెన్‌లో 2014 చివరి నుంచి అంతర్యుద్ధం కొనసాగుతోంది. పలు ఉత్తర ప్రావిన్సులను హౌతీ తిరుగుబాటుదారులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అధ్యక్షుడు అబ్దు-రబ్బూ మన్సూర్ హాడి నాయకత్వంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని రాజధాని సనా నుంచి తరిమివేశారు.


By June 06, 2021 at 09:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/17-killed-in-houthi-ballistic-missile-attack-on-yemens-marib/articleshow/83276565.cms

No comments