Breaking News

రష్యాలో ఉన్న వ్యక్తికి తెలిసింది.. మీకు తెలియదా? కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు సంచనల వ్యాఖ్యలు


దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా నుంచి బయటపడాలంటే అందరకీ వ్యాక్సిన్‌ ఇవ్వడమే మార్గమని చెబుతున్నప్పటికీ.. ఇలాంటి పరిస్థితులు నెలకోవడం బాధాకరమని వ్యాఖ్యానించింది. అంతేకాదు, భారత్‌లోని టీకా తయారీ సంస్థల గురించి రష్యాలో ఉన్న వ్యక్తికి తెలిసిన విషయం కేంద్రానికి తెలియదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. స్పుత్నిక్-వీను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పనేషియా బయోటెక్‌కు సంబంధించిన ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘రెండో దశ వ్యాప్తి సమయంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే ఆవేదన కలుగుతోంది.. బాధ్యతగల పౌరుడిగా మీకు కూడా అదే ఆవేదన ఉంటుంది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్‌ కొరత ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది.. ఈరోజుకు కూడా ఢిల్లీలో వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. దేశంలో ఎన్నో మంచి ఉత్పత్తులు ఉన్నాయి. వాటికి చిన్నపాటి చేయూత ఇస్తే చాలు’ అని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ నజ్మీ వజీరీల ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా ‘ఎక్కడో రష్యాలో ఉన్న ఓ వ్యక్తి హిమాచల్‌లో ఉన్న వ్యాక్సిన్‌ తయారీ సంస్థను గుర్తించగలిగారు. కానీ, అలా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యింది’ అని మండిపడింది. దేశంలో వనరులున్నప్పటికీ వ్యాక్సిన్‌ తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇన్‌ఫ్లూయోంజా వ్యాక్సిన్‌ తయారీ విషయమై 2010లో ఓ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై పనేషియా బయోటెక్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 2019లో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పనేషియా బయోటెక్‌కు రూ.14కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాకుండా 2012 నుంచి ఇప్పటి వరకు ఏడాదికి 12శాతం వడ్డీని కలిపి చెల్లించాలని పేర్కొంది. అమ్మకపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీలో జమ చేయాల్సి ఉంటుందని తెలిపింది. తాజాగా ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై దిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.


By June 05, 2021 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-high-court-anguished-over-shortage-of-covid-vaccines-in-india/articleshow/83252378.cms

No comments