Breaking News

రాక్షసత్వం.. భార్యను గొడ్డలితో నరికి.. శవాన్ని నడివీధిలో ఈడ్చుకెళ్లిన ఉన్మాది


భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.. ఆమె మృతదేహాన్ని నడివీధిలో ఈడ్చుకెళ్లి ఉన్మాదం ప్రదర్శించాడు. ఈ అమానుష దాడిలో వారి కుమారుడు కూడా బలయ్యాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామ్‌పుర పరిధిలోని భాతాపురకు చెందిన సునీల్‌ వాల్మీకి అలియాస్‌ పింటూ (40) మంగళవారం మధ్యాహ్నం సోదరుడి ఇంటిలో ఉన్న భార్య సీమ (35), కుమారుడు అవినాశ్‌ (9 నెలలు)ను తీసుకుని వెళ్లాడు. అదే రోజు రాత్రి భార్యతో గొడవపడిన పింటూ ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని వీధిలోకి తీసుకొచ్చి 80 మీటర్ల వరకూ ఈడ్చుకెళ్లి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సీమాపై దాడిచేసిన సమయంలో అక్కడే ఉన్న పసిబాలుడికి కూడా గాయాలయ్యాయి. చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా బుధవారం ఉదయం మృతి చెందాడు. స్థానికంగా కలకలం రేగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. పింటూ, సీమలకు 15 ఏళ్ల కిందట వివాహం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే అత్యాచారం, దాడి తదితర ఐదు కేసులున్నట్లు చెప్పారు. నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి హత్యచేసినట్టు చెప్పి పరారయ్యాడని రామ్‌పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హన్సరాజ్ మీనా అన్నారు. ఘటన తర్వాత అతడు లొంగిపోలేదని, అక్కడ నుంచి పరారయ్యాడని తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం సీమా తన సోదరుడి ఇంటి నుంచి 9 నెలల చిన్నారితో వచ్చిందన్నారు. వీరి మరో కుమారుడు (9) మాత్రం మేనమామ ఇంటి వద్దే ఉన్నట్టు తెలిపారు. భార్యతో గొడవపడిన నిందితుడు.. ఆమెపై గొడ్డలితో దాడిచేశాడు. అయితే, పసిబాలుడు ఎలా గాయపడ్డాడో తెలియదని పోలీసులు చెప్పారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు.


By June 03, 2021 at 07:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-and-drags-body-on-road-son-dies-of-injuries-in-rajasthan/articleshow/83193209.cms

No comments