Breaking News

హానీ ట్రాప్‌తో మెహుల్ చోక్సీ కిడ్నాప్.. ఆమె కోసం డొమినికా బీచ్‌కు!


పీఎన్‌బీ కుంభకోణంలో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ మిస్సింగ్, అరెస్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయనను కిడ్నాప్‌ చేసినట్టు ఛోక్సీ తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అయితే, చోక్సీ తన గర్ల్‌ ఫ్రెండ్‌తో డిన్నర్‌ కోసం వెళ్లి పోలీసులకు చిక్కినట్టు ఆంటిగ్వా ప్రధాని వెల్లడించారు. కానీ, ఆమె చోక్సీ గర్ల్ ఫ్రెండ్ కాదని, కిడ్నాప్‌ ముఠాలో ఓ పాత్రధారని సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఓ జాతీయ మీడియా కథనం వెలువరించింది. గర్ల్‌ఫ్రెండ్‌తో గడిపేందుకు చోక్సీ డోమినికా వెళ్లింటాడని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బార్బరా జరబికా అనే యువతి ఫోటోలను విడుదల చేసిన అంటిగ్వా మీడియా.. ఆమె విద్యార్హతలు సహా వివరాలను వెల్లడించింది. అయితే, ఆ యువతి చోక్సీ స్నేహితురాలు కాదని చోక్సీ తరఫున లాయర్ విజయ్ అగర్వాల్ ఆరోపించారు. ఆమె చోక్సీ గర్ల్ ఫ్రెండ్ కాదని, కిడ్నాప్‌ ముఠాలో ఓ సూత్రధారని పేర్కొన్నారు. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఛోక్సీతో పరిచయం పెంచుకుని చోక్సీని హానీట్రాప్‌లోకి లాగిందని అన్నారు. మే 23న ఛోక్సీకి ఫోన్‌ చేసి తన అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానించి, ఆయన అక్కడకు వెళ్లేసరికి కిడ్నాప్ చేయించిందన్నారు. ‘‘మెహుల్ చోక్సీని ఓ యువతి హానీట్రాప్ చేసింది.. ఆమె కిడ్నాప్ గ్యాంగ్‌లో ఓ సభ్యురాలు.. చోక్సీ నివాసానికి సమీపంలోనే ఆ మహిళ ఉండేదు.. ఈవెనింగ్ వాక్‌లో పరిచయం పెంచుకుని కుటుంబంతో స్నేహం నటించింది.. తర్వాత వేరే ప్రాంతానికి మకాం మార్చి.. చోక్సిని అక్కడకు ఆహ్వానించింది.. ఆమె పిలుపుతో అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన చోక్సీని పలువురు బలవంగా ఎత్తుకెళ్లి బోటులో డొమినాకాకు తరలించారు.. ఆయన తన పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేదు.. ఆ యువతి తర్వాత అదృశ్యమైంది’’ అని లాయర్ అన్నారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత డొమినికా బీచ్‌లో ఛోక్సీని అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. మరోవైపు, డొమినికా జైల్లో ఉన్న ఛోక్సీ ఫొటోలను ఆంటిగ్వా న్యూస్‌ రూం ఆదివారం విడుదల చేసింది. అందులో ఆయన చేతులు, కంటిపై గాయాలైనట్లు ఉన్నాయి. ఆయనను తీవ్రంగా కొట్టి ఉంటారని ఆయన న్యాయవాదులు ఆరోపించారు. దీనిపై వారు కోర్టుకు వెళ్లడంతో ఛోక్సీని ఆసుపత్రికి తరలించాలని అక్కడి కోర్టు ఆదేశించింది. దీంతో సోమవారం ఆయనను డొమినికా రాజధాని రొసెవులోని ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఛోక్సీని భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు చర్యలు ముమ్మరం చేశాయి. శనివారం ఉదయం ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం ఢిల్లీ నుంచి డొమినికాకు వెళ్లింది. ఛోక్సీ అప్పగింతకు అవసరమైన పత్రాలు ఆ విమానంలో వచ్చాయని ఆంటిగ్వా ప్రధాని తెలిపారు. అయితే ఛోక్సీ కేసుపై డొమినికా కోర్టు జూన్‌ 2న విచారణ జరపనుంది. ఆయనను నేరుగా భారత్‌కు పంపాలా లేదా ఆంటిగ్వా పంపాలా అన్నదానిపై కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ. 13వేల కోట్లు ఎగవేసిన కేసులో ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్‌ మోదీ నిందితులుగా ఉన్నారు.


By June 01, 2021 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-planted-to-trap-and-abduct-fugitive-diamantaire-mehul-choksi-claims-lawyer/articleshow/83136787.cms

No comments